జూపల్లితో ఏనుగు రవీందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి భేటీ.. బీజేపీకి షాక్ ఇవ్వనున్నారా?

Published : Jul 06, 2023, 09:41 AM IST
జూపల్లితో ఏనుగు రవీందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి భేటీ.. బీజేపీకి షాక్ ఇవ్వనున్నారా?

సారాంశం

తెలంగాణ బీజేపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పలువురు బీజేపీ నేతలు.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమావేశం కావడం మరింత కలకలం రేపుతోంది.

తెలంగాణ బీజేపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర బీజేపీలోని కొందరు నేతలు అసమ్మతి స్వరం వినిపించడంతో.. పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. రాష్ట్రంలోని పార్టీ అధ్యక్షుడిని మార్చడంతో పాటు.. ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమించింది. అలాగే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని నియమించింది. అయినప్పటికీ పార్టీలో పరిస్థితి చక్కబడినట్టుగా కనిపించడం లేదు. తాజాగా పలువురు బీజేపీ నేతలు.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమావేశం అయ్యారు. త్వరలోనే అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న జూపల్లితో బీజేపీ నేతలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. 

జూపల్లిని కలిసినవారిలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీకే అరుణ అనుచరుడు పవన్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు వారిని కాంగ్రెస్‌లోని రావాల్సిందిగా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ప్రియాంక గాంధీ మహబూబ్‌నగర్ పర్యటనలో కాంగ్రెస్‌లో చేరాలని కోరినట్టుగా సమాచారం. 

వీరిలో ఏనుగు  రవీందర్ రెడ్డికి ఈటల అనుచరుడిగా పేరుంది. రెండేళ్ల క్రితం బీజేపీలో చేరిన రవీందర్ రెడ్డి.. ఈటలతో పాటే కలిసి నడుస్తున్నారు. అయితే ఇటీవల ఈటల రాజేందర్‌కు రాష్ట్ర బీజేపీ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించిన సమయంలో రవీందర్ రెడ్డి పెద్దగా కనిపించలేదు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారని.. అందుకే తెరమీద కనిపించడం లేదనే ప్రచారం సాగుతుంది. మరోవైపు యెన్నం శ్రీనివాస్ రెడ్డి  కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్దమవుతున్నట్టుగా మహబూబ్ నగర్‌ జిల్లాలో టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో ఏనుగు  రవీందర్ రెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డిలు.. జూపల్లితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ ముగ్గురు నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad Haunted House : నగర నడిబొడ్డున దెయ్యాల నివాసం.. కుందన్‌బాగ్‌ బంగ్లా అసలు కథ ఇదే..!
KTR First Reaction on Kavitha Party: కవిత పార్టీపై కేటీఆర్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ | Asianet News Telugu