బైక్ ను వెంబడించి దాడి చేసి మహిళను వివస్త్రను చేసి కొట్టారు

By telugu teamFirst Published Jun 12, 2021, 8:38 AM IST
Highlights

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని ఓ తండాలో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. బైక్ మీద వెళ్తున్న మహిళను వెంబడించి దాడి చేసి ఆమెను వివస్త్రను చేసి కొట్టారు.

నాగర్ కర్నూలు: తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి స్థలం వివాదంలో కొందరు వ్యక్తులు మహిళపై దాడి చేసి, ఆమెను వివస్త్రను చేశారు. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని జేపీ నగర్ తండాలో జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జేపీ నగర్ తండాలో ఓ మహిళ ఓ స్థలంలో ఇంటి నిర్మాణం ప్రారంభించింది. వివాదాస్పద స్థలంలో నిర్మాణం వద్దని తండావాసులు చెప్పారు. దానిపై ఆమె మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసింది. వారి అనుమతితో తిరిగి ఇంటి నిర్మాణం చేపట్టింది. 

ఈ నెల 9వ తేదీన తండావాసులు వచ్చి అడ్డుకోబోయారు. దాంతో ఆమె ఓ వ్యక్తితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం మహిళలు కొంత మంది ఆమె ఇంటికి వెళ్లి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని విడిపించేందుకు ప్రయత్నించారు. 

బాధితురాలిని బైక్ మీద వేరే చోటికి తరలిస్తుండగా తండావాలు కొంత మంది వెంబడించి వివస్త్రను చేసి కొట్టారు. ఆ తర్వాత ఆమెను పోలీసుుల రక్షించి ఇంటికి పంపించారు. ప్రస్తుతం తండాలో పోలీసు గస్తీ కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇరు వర్గాలపై వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేందర్ చెప్పారు.

click me!