Hyderabad Selfie Suicide: వైన్స్ కోసం బలవంతం... మనస్థాపంతో యువకుడి సెల్ఫీ సూసైడ్

Published : Mar 06, 2022, 09:03 AM ISTUpdated : Mar 06, 2022, 09:20 AM IST
Hyderabad Selfie Suicide: వైన్స్ కోసం బలవంతం...  మనస్థాపంతో యువకుడి సెల్ఫీ సూసైడ్

సారాంశం

తనకు జీవనాధారం లేకుండా చేయడమే కాదు నమ్మించి మోసం చేసారని ఆరోపిస్తూ ఓ యువకుడు మొబైల్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడిన దారుణం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్: వైన్ షాప్ కోసం బలవంతంగా తన మొబైల్ షాప్ ను ఖాళీ చేయించి జీవనాదారం లేకుండా చేసారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. తన ఆత్మహత్యకు గల కారణాన్ని వివరిస్తూ సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేసాక ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ (hyderabad) నగరంలోని చైతన్యపురిలోని ఐసిఐసిఐ బ్యాంక్ లైన్ లోని ఓ అద్దె భవనంలో రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి  సెల్ ఫోన్ దుకాణాన్ని నిర్వహించేవాడు. అద్దెకు సంబంధించి భవన యజమానితో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నాడు. 

ఇలా మొబైల్ షాప్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో రాజేందర్ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇలా ఈ షాప్ పైనే ఆదారపడ్డ రాజేందర్ కు భవన యజమాని మోసం చేసాడు. వైన్ షాప్ కోసం రాజేందర్ మొబైల్ షాప్ ను బలవంతంగా ఖాళీ చేయించాడు. అర్థాంతకంగా షాప్ ఖాళీచేయించడంతో పాటు అడ్వాన్స్ డబ్బులు, ఇతర సామాగ్రి కోసం ఖర్చుచేసిన మొత్తం కలిపి రూ.10లక్షలు పరిహారంగా ఇస్తానని చెప్పడంతో రాజేందర్ కూడా తన షాప్ ను ఖాళీ చేసాడు. 

అయితే షాప్ ఖాళీచేసి నెలలు గడుస్తున్నా భవన యజమాని ఇస్తానన్న పదిలక్షలు ఇవ్వలేదు. ఇలా కాలయాపన చేస్తుండటంతో రాజేందర్ కు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. లోన్ తీసుకుని కొనుగోలు చేసిన ఫ్లాట్ ఈఎంఐ చెల్లించకపోవడంతోవ బ్యాంక్ నుండి ఒత్తిడి ఎక్కువయ్యింది. ఒక్కసారిగా ఇలా ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడం,  భవన యజమాని డబ్బులివ్వకుండా మోసం చేయడంతో తీవ్ర ఆందోళనకు గురయిన రాజేందర్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. 

భార్యాపిల్లలను చంచల్ గూడలోని తల్లిదండ్రుల వద్దకు పంపించిన రాజేందర్ ప్లాట్ కు ఒంటరిగా చేరుకున్నాడు. ఈ క్రమంలో తన సెల్ ఫోన్ లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలను తెలిపాడు.     

శనివారం ఉదయం ఈఎంఐ డబ్బుల కోసం బ్యాంక్ సిబ్బంది రాజేందర్ రెడ్డి ప్లాట్ వద్దకు చేరుకున్నారు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి పక్క ప్లాట్ వారి సహాయంతో బలవంతంగా తలుపులు తెరిచారు. లోపలికి వెళ్ళగానే రాజేందర్ ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు.  దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.  అనంతరం మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు ముందు సెల్పీ వీడియో రికార్డ్ చేసిన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుులు తెలిపారు. 

రాజేందర్ రెడ్డి ఆత్మహత్య వార్త తెలిసి భార్యాపిల్లలతో పాటు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేసి భర్త మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడి భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)

PREV
click me!

Recommended Stories

Tank Bund Ganesh Immersion: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్.. ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి? అసలు కారణం ఏంటి?
Weather Update: 3 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్