
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎన్టీఏ ప్రభుత్వం నాలుగన్నరేళ్లుగా కాలయాపన చేస్తోందని విమర్శించారు.
ఏపీలో తమకు ఉనికి లేదనే నిర్ణయానికి వచ్చిన బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేసిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో హోదా ఇస్తామంటున్న కాంగ్రెస్కు కూడా ఏపీలో పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మరి కాంగ్రెస్ మద్దతు లేకుండా ప్రత్యేక హోదా ఎలా సాధిస్తారో అంతుబట్టడం లేదని వ్యాఖ్యానించారు. హోదా కోసం పోరాడటంతో పాటు లక్ష్యాన్ని సాధించడానికి అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్ను బలపరుస్తూ తీర్మానం చేయడం మేలని ఆమె తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందని భావించి కాంగ్రెస్కు మద్దతుపలికినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యడంతో తన లక్ష్యం నెరవేరిందనే వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తిగా తాను ఈ ప్రతిపాదన చేస్తున్నానని విజయశాంతి ట్విట్టర్లో తెలిపారు.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై విజయశాంతి వ్యాఖ్యానించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల కేసీఆర్ ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత విజయశాంతి మాత్రమే అనుకూలంగా వ్యాఖ్యానించడం రాజకీయాల్లో చర్చకు దారి తీస్తోంది.