సీసీఐ పునరుద్ధరణకు కేంద్రంపై ఒత్తిడి, ఉమ్మడిగా ఉద్యమిద్దాం : మంత్రి కేటీఆర్

By Siva KodatiFirst Published Jan 26, 2022, 5:36 PM IST
Highlights

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) (cement corporation of india) పునరుద్ధరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (ktr) . ఉమ్మడి ఆదిలాబాద్‌లో అనేక పరిశ్రమలను స్థాపించి జిల్లాలో ఉపాధి కల్పన కోసం తాము ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) (cement corporation of india) పునరుద్ధరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (ktr) . ఆదిలాబాద్‌కు (adilabad) చెందిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నతో (jogu ramanna) పాటు జిల్లాకు చెందిన ఇతర ముఖ్య నాయకులు ఈ మేరకు ఇవాళ మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. కంపెనీ పునః ప్రారంభం చేపట్టాల్సిన ఆందోళన కార్యాచరణపై చర్చించారు. కంపెనీ పునః ప్రారంభం కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నామని ఈ సందర్భంగా వారు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. సీసీఐ పునఃప్రారంభానికి అవసరమైన అన్ని రకాల ప్రత్యేక రాయితీలను ఇస్తామని, కొత్త కంపెనీని ఏర్పాటు చేస్తే ఎలాంటి రాయితీలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుతాయో వాటిని సిసిఐకి అందించేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని కేటీఆర్ వివరించారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌లో అనేక పరిశ్రమలను స్థాపించి జిల్లాలో ఉపాధి కల్పన కోసం తాము ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేవేసేందుకు కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆదిలాబాద్‌లోని సిసిఐ పునరుద్ధరణ చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులను స్వయంగా కలిశామని, అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశామని కేటీఆర్ గుర్తుచేశారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదని ఆయన అన్నారు. 

ఇప్పటికే ఆదిలాబాద్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లుని ప్రారంభించిన చరిత్ర, నిబద్ధత తమకు ఉందని కేటీఆర్ వెల్లడించారు. మరోవైపు జిల్లాకు సిరుల వరప్రధాయిని అయిన సింగరేణిని (singareni collieries) క్రమంగా ప్రైవేటీకరించే ప్రయత్నాలకు కేంద్రం తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. సిసిఐ విషయంలో అవసరమైతే అదిలాబాద్ యువత ప్రయోజనాల కోసం ఢిల్లీకి సైతం వెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే ఆదిలాబాద్‌కు ఐటీ టవర్‌ను మంజూరు చేస్తామని కేటీఆర్ తెలిపారు. దీంతో పాటు టెక్స్ట్ టైల్ పార్కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను సైతం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. 

click me!