
సమాజంలో రోజురోజుకు అక్రమ సంబంధాలు ఎక్కువవుతున్నాయి. భార్యలకు తెలియకుండా భర్తలు.. భర్తలకు తెలియకుండా భార్యలు పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. పడక సుఖం కోసం అవసరమైతే జీవిత భాగస్వాములను దారుణంగా చంపుతున్నారు. తాజాగా భార్య అందంగా లేదంటూ వితంతువైన మరో మహిళతో భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడంతో అతని భార్య పిల్లలలో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పన్నీరు రాజేష్కు ఆలేరు మండలం కొల్లూరు గ్రామానికి చెందిన పూజతో 7 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు యక్షశ్రీ, హారిక సంతానం.
రాజేష్, పూజ దంపతులు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రాజేశ్కు ఓ వితంతువుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి రాజేశ్ భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. అందంగా లేవు.. విడాకులు ఇస్తానంటూ భార్యను హింసిస్తున్నాడు. వేధింపులు నానాటికీ తీవ్రం కావడంతో పూజ ముత్తిరెడ్డిగూడెంలో వుంటున్న అత్తగారింటికి వెళ్లి అక్కడే వుంటోంది.
అయితే వారు కూడా తమ వద్ద వుండొద్దంటూ వేధింపులకు గురిచేయడంతో పూజ ఆందోళనకు దిగింది. సోమవారం సాయంత్రం ముత్తిరెడ్డిగూడెం రోడ్డుపై బైఠాయించి పిల్లలు, తనపై కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేసింది. స్థానికులు వెంటనే గమనించి ఆమెను అడ్డుకుని, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పూజ తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతోంది.