తమ సహజీవనానికి అడ్డు వస్తున్నాడని ఓ భార్య భర్తను రోకలితో కొట్టి చంపింది. ఈ ఘటన కొత్తగూడెంలో కలకలం రేపింది.
కొత్తగూడెం : తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ భార్య పెళ్లయిన తర్వాత మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ విషయం భర్తకు తెలిసి అడ్డుగా వస్తున్నాడని కోపంతో ప్రియుడుతో కలిసి అతడిని హత్య చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకటో పట్టణ పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా తెలిపారు.. గాయపాక ప్రవీణ్ కుమార్ (35) అనే వ్యక్తి సన్యాసి బస్తీకి చెందినవాడు. పెయింటర్ గా పనిచేస్తున్నాడు. అతనికి రేగాని లావణ్య అనే మహిళతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఆమె కూడా అదే ప్రాంతానికి చెందింది. ఆ తర్వాత కొద్ది నెలలకు ఆమెకు స్థానికుడైన తంగళ్ళ సుమంత్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది భర్త ప్రవీణ్ కుమార్ కు తెలిసింది.
దీంతో అతను భార్యను వారించాడు. కానీ ఆమె వినలేదు. రెండేళ్ల క్రితం ప్రియుడితో కలిసి ఇంట్లోంచి ఎటో వెళ్లిపోయింది కూడా. ఆ తర్వాత కొద్ది కాలానికి తిరిగి వచ్చారు. అదే బస్తీలో.. తన భర్త ఇంటికి పక్కవీధిలోనే ఇల్లు తీసుకుని ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే తనంటే ఇష్టం లేకపోతే విడాకులు ఇవ్వాలి.. కానీ, ఇలా వేరే వారితో తనకళ్ళ ముందే సహజీవనం చేయడాన్ని ప్రవీణ్ కుమార్ జీవించుకోలేకపోయాడు. లావణ్య మీద ఇదే విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనేకసార్లు పెద్దమనుషులతో పంచాయతీ పెట్టించాడు. అయితే, లావణ్య మాత్రం తాను ప్రియుడితోనే ఉంటానని ప్రతిసారి తెగేసి చెప్పింది.
అమెరికా వెళ్లడానికి కొన్ని గంటల ముందు రోడ్డు ప్రమాదం.. నల్గొండలో యువతి మృతి
ఈ విషయం మీద వాళ్ళ మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్ శనివారం రాత్రి కూడా భార్య, ఆమె ప్రియుడు ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. దీంతో కంగారు పడ్డ లావణ్య పోలీసులకు సమాచారం అందించింది. వారు అక్కడికి వచ్చి అతడిని ఇంటికి పంపించి వేశారు. అయితే, అప్పటికి వెళ్ళిపోయిన అతడు ఆదివారం ఉదయం మళ్లీ వచ్చాడు. దీంతో లావణ్యకు పట్టరాని కోపం వచ్చింది. రోకలిబండతో ప్రవీణ్ మీద దాడి చేసింది. ఆమె ప్రియుడు కూడా ఇనపరాడ్ తో ప్రవీణ్ ను చితకబాదాడు. ఈ దాడిలో ప్రవీణ్ తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. ఈ గలాట గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని అతడిని జిల్లా సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్యులు అతనికి చికిత్స అందించారు. కానీ చికిత్స పొందుతూనే ఒక గంట తర్వాత అతడు మృతి చెందాడు. భార్య, ఆమె ప్రియుడు దాడిలో చేతులు విరగడంతో పాటు.. ప్రవీణ్ శరీర లోపలి భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీనివల్లే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రెహమాన్, ఇన్చార్జి సిఐ రాజు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత బంధువులకు అప్పగించారు. అతని మృతికి కారణమైన భార్య, ప్రియుడి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు డిఎస్పి తెలిపారు.