దారుణం.. ఉద్యోగం కోసం భర్తను చంపిన భార్య...

By SumaBala BukkaFirst Published Jan 5, 2023, 8:22 AM IST
Highlights

తాగొచ్చి భర్త వేధిస్తున్నాడని.. అతడు చనిపోతే కారుణ్య నియామకం కింద అతని ఉద్యోగం తనకు వస్తుందని ఆశపడ్డ భార్య.. దారుణానికి తెగించింది. 

భద్రాద్రి కొత్తగూడెం : భర్త ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓ భార్య దారుణానికి తెగించింది. ఏకంగా అతడిని హతమార్చింది. ప్రమాదవశాత్తు మరణించాడని కథ అల్లింది. భర్త చనిపోతే కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం వస్తుందని ఆశపడి ఈ పని చేసిందని పోలీసుల విచారణలో తేలడంతో అరెస్ట్ అయి జైలు పాలయింది. భర్త నిత్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని.. అందుకే అతడిని హతమార్చినట్లు పోలీసు విచారణలో అంగీకరించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది. బుధవారం చుంచుపల్లి ఎస్సై  కె. సుమన్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను  ఇలా తెలిపారు..

భద్రాద్రి కొత్తగూడెంలోని గాంధీ కాలనీలో కొమ్మర బోయిన శ్రీనివాస్ (50), భార్య సీతామహాలక్ష్మి (43)తో కలిసి ఉంటున్నాడు. కొత్తగూడెం కలెక్టరేట్ లో అటెండర్ గా శ్రీనివాస్ పని చేస్తున్నాడు. డిసెంబర్ 30 ఉదయం తీవ్రగాయాలతో ఉన్న శ్రీనివాస్ ను కొత్తగూడెంలోని జిల్లా ఆస్పత్రిలో సీతా మహాలక్ష్మి జాయిన్ చేసింది. డిసెంబర్ 29న అర్థరాత్రి శ్రీనివాస్ వంటింట్లో కాలు జారిపడ్డాడని..దీంతో తలకు తీవ్ర గాయమైంది అని చెప్పింది. జిల్లా ఆస్పత్రిలో వైద్యులు వెంటనే అతనికి చికిత్స అందించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ రెండు, మూడు గంటల్లోనే శ్రీనివాస్ మరణించాడు.

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్‌ .. మాణిక్యం పోయే, మాణిక్‌రావు వచ్చే

అయితే వీరికి సాయికుమార్ అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి మృతిపై అతడు అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ మేరకు తనకు తండ్రి మరణం మీద అనుమానం ఉంది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్తను ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత.. భార్య సీతామహాలక్ష్మి కనిపించకుండాపోయింది. దీంతో అనుమానం పై ఆమెపై నిఘా పెట్టారు. ఈ మంగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు ఆమె కొత్తగూడెం రైల్వే స్టేషన్ కు చేరుకుంది.  అప్పటికే అక్కడ కాపు కాసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

ఆ తర్వాత తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టింది. ‘ ఆ రోజు నా భర్త బాగా తాగి వచ్చాడు. రోజూ లాగే వేధించాడు. నిత్యం ఇలాంటి వేదింపులే. అందుకే అతను నిద్రలోకి జారుకోగానే.. కర్రతో తలమీద కొట్టాను. బాగా దెబ్బ తగిలింది. ఆ తరువాత వంటింట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టాను.. కాలుజారి వంటింట్లో పడిపోయాడని  చెప్పాను’ అని  నిందితురాలు అంగీకరించింది.  దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

click me!