ఈ ప‌దేండ్ల‌లో ఏం సాధించారు.. తెలంగాణ ఆవిర్భావ‌ దశాబ్ది వేడుకల‌ క్ర‌మంలో కేసీఆర్ పై బండి సంజ‌య్ ఫైర్

By Mahesh RajamoniFirst Published May 27, 2023, 3:49 PM IST
Highlights

Hyderabad: ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేని తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయలతో దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కుమార్ ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికలకు, తెలంగాణ ఎన్నికలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
 

Telangana Formation Day 2023:  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తున్నారనీ, గత పదేళ్లలో ఏం సాధించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇది జిమ్మిక్కుగా ఆరోపించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింది. దీని కోసం రూ.150 కోట్ల‌ను కూడా కేటాయించింది.

కరీంనగర్ లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన అనంతరం బండి సంజ‌య్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలన్న కాంగ్రెస్ సహా విపక్షాల వ్యాఖ్యలను సంజయ్ తోసిపుచ్చారు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయమని వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ గత మూడేళ్లలో డిపాజిట్లు కూడా దక్కని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయమని కొన్ని పత్రికలు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్ఎస్, ప్రతిపక్షాలు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రపతిపై ప్రేమాభిమానాలు కురిపిస్తున్నాయన్నారు. పార్లమెంటు కస్టోడియన్ లోక్ సభ స్పీకర్ అనీ, పార్లమెంటు భవన ప్రారంభోత్సవం ఎవరి ద్వారా చేయాలనేది స్పీకర్ విచక్షణాధికారమనీ, స్పీకర్ అభ్యర్థన మేరకు ప్రధాని మోడీ దీనిని ప్రారంభిస్తున్నారని ఆయన అన్నారు.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేని తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయలతో దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోందని ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికలకు, తెలంగాణ ఎన్నికలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక ఎమ్మెల్యే సీటుకే పరిమితమైన బీజేపీ 2019 లోక్ స‌భ‌ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకుందనీ, ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. "జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలిచాం. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. బీజేపీని ఇబ్బంది పెట్టేందుకు ఓ వర్గం మీడియా కావాలనే తప్పుడు వార్తలు రాస్తోందని" ఆరోపించారు.

గ్రానైట్ మాఫియా నుంచి కమీషన్లు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు చేసిన ఆరోపణలను ఖండించిన బండి సంజయ్ తన ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. తాను ఎంత‌గానో ఆరాధించే దేవుళ్ల‌పై ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తన బ్యాంకు ఖాతాలను  కూడా చెక్ చేసుకోవ‌చ్చు పేర్కొన్నారు.  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జన్ సంపర్క్ అభియాన్ పేరుతో మోడీ తొమ్మిదేళ్ల పాలనపై జూన్ 30 నుంచి జూలై 30 వరకు ప్రజలను కలుస్తామని చెప్పారు.

click me!