ఆర్టీసీ సమ్మెపై వీడని కేసీఆర్ పట్టు: కాంగ్రెసులో హుజూర్ నగర్ సెగ

By narsimha lodeFirst Published Nov 3, 2019, 10:49 AM IST
Highlights

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ మెట్టుదిగడం లేదు. ఆర్టీసీ జేఎసీ నేతలు ఆదివారం నాడు తమ భవిష్యత్తు కార్యాచరణను తేల్చనున్నారు. మరోవైపు ఈ నెల 5వ తేదీలోపుగా కార్మికులు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు నివేదికలు వద్దని తేల్చి చెప్పింది. సరైన నివేదికలను ఇవ్వాలని ఆర్టీసీ ఇంచార్జీ ఎండీని ఆదేశించింది. ఈ నెల 5వ తేదీలోపుగా కార్మికులు విదుల్లో చేరాాలని ఆదేశించింది. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని సీఎం మరోసారి తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని 5100  రూట్లను ప్రైవేట్‌పరం చేయాలని తెలంగాణ సీఎం ప్రకటించారు. గత వారంలో ఆర్టీసీ సమ్మె చుట్టూనే తెలంగాణ రాజకీయాలు నడిచాయి.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5వ తేదీ నుండి సమ్మె నిర్వహిస్తున్నారు. నవంబర్ 5వ తేదీ లోపుగా  ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

also read:RTC Strike:వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కండక్టర్ రవీందర్ మృతి

ఆర్టీసీ సమ్మెతో పాటు పలు అంశాలపై తెలంగాణ  కేబినెట్ లో చర్చించారు.  ఈ నెల 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ఆర్టీసీపై చర్చించారు.  రాష్ట్రంలో 5100 రూట్లను ప్రైవేట్ పరం చేస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఆర్టీసీ జేఎసీ నేతల  బెదిరింపులకు తాము భయపడేందుకు సిద్దంగా లేమని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.  ఇతర రాష్ట్రాల్లో కూడ ఆర్టీనీ రూట్లను ప్రైవేట్ పరం చేసినట్టుగా సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. అదే విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడ అమలు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

బస్సు ఛార్జీల పెంపు విషయమై ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.ఇక ఆర్టీసీ సమ్మెను పురస్కరించుకొని హైకోర్టులో ఈ నెల 1వ తేదీన ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో అన్నీ తప్పులే ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది.

సరైన నివేదికలతో హైకోర్టులో నవంబర్ 7వ తేదీన నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆర్టీసీ ఇంచార్జీ ఎండీని ఆదేశించింది.ఆర్టీసీ ఇంచార్జీ ఎండి సునీల్ శర్మ ఈ నెల 1వ తేదీన హైకోర్టుకు సమర్పించిన అఫడవిట్‌‌లో వివరాలు సరిగా లేవని హైకోర్టు అభిప్రాయపడింది.

ఆర్టీసీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లికి చెందిన ఆర్టీసీ కండక్టర్ నీరజ ఆత్మహత్యకు పాల్పడింది.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన డ్రైవర్ కృష్ణయ్య గౌడ్ మృతి చెందాడు. గత నెల 30వ తేదీన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఆర్టీసీ జేఎసీ సకల జనుల సమర భేరీ పేరుతో భారీ సభను నిర్వహించింది.ఈ సభకు పెద్ద ఎత్తున కార్మికులు హాజరయ్యారు.

ఈ సభకు హాజరైన బాబు అనే ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుతో మరణించాడు. బాబు అంత్యక్రియల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొంది. మూడు రోజుల పాటు బాబు మృతదేహంతో ఆర్టీసీ జేఎసీ, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆందోళనకు దిగారు.

ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పోలీసులు తనపై దాడి చేశారని కరీంనగర్ ఎంపీ సంజయ్ ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం  ఈ విషయాన్ని ఖండించారు. తాము ఎంపీపై దాడికి దిగలేదని చెప్పారు.

ఎంపీ అంటే తమకు గౌరవం ఉందని, బండి సంజయ్ కు రక్షణ కల్పించేందుకు తాము ప్రయత్నించిన విషయాన్ని కరీంనగర్ ఎస్పీ శనివారం రాత్రి ప్రకటించారు. పోలీసుల వివరణతో ఎంపీ బండి సంజయ్ మాత్రం విబేధించారు.

Also Read: 5వ తేదీ అర్ధరాత్రి వరకే డెడ్‌లైన్: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఫైనల్ ఛాన్స్.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై ఆర్టీసీ జేఎసీ ఆదివారం నాడు సమావేశం కానుంది.ఈ సమావేశంలో ఆర్టీసీ జేఎసీ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ తీసుకొన్న నిర్ణయాలతో పాటు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

హుజూర్‌నగర్ ఓటమికి నాదే బాధ్యత

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. మూడు రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపై చర్చించారు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పార్టీలో చోటు చేసుకొన్న క్రమశిక్షణ రాహిత్యంపై కూడ ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన నేతలపై చర్యలు తీసుకోవాలని పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు కోర్ కమిటీ సమావేశంలో డిమాండ్ చేశారు.

Also Read: కేసీఆర్: ఏమైతది.. ఆర్టీసీ ఉండదు, కోదండరామ్, రేవంత్ రెడ్డిలకు రిప్లై.

హుజూర్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  ఓటమితో పీసీసీ చీఫ్ పదవి మార్పు విషయమై మరోసారి చర్చసాగుతోంది. పీసీసీ చీఫ్ పదవి నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో మరొకరికి ఈ బాధ్యతలను అప్పగిస్తారని పార్టీలో చర్చ సాగుతోంది.తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి రెడ్డి, బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతల మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది. 

click me!