ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్.. బైటికి వచ్చేముందు జాగ్రత్త !

By SumaBala BukkaFirst Published Dec 11, 2023, 9:18 AM IST
Highlights

ఇళ్లల్లో ఉన్నా కూడా వేడి దుస్తులు, స్వెట్టర్లు వేసుకుంటే కానీ చిన్నపిల్లలు, వృద్ధులు ఉండలేని పరిస్థితిలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. డిసెంబర్ నెల మొదలైన నాటి నుంచి రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంచు, చలిగాలులు పెరిగిపోతున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి చలి విపరీతంగా పెరిగిపోతుంది. ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు..  పొగ మంచు వ్యాపించే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి చేతులు బిగుసుకుపోయేంత చలి పెడుతోంది. ఉదయంపూట బయటికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

చలి తీవ్రత పెరగడంతో శ్వాసకోశ ఇబ్బందులతో సతమతమవుతున్నారు. జలుబు, దగ్గు, శ్వాస కోశ వ్యాధులతో ఆస్పత్రులకు పోటెత్తుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి.  అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు.  తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంచు దట్టంగా కురుస్తోంది. దీంతో  గణనీయంగా పగటి ఉష్ణోగ్రతలు  పడిపోతున్నాయి. 

Latest Videos

చంద్రబాబు‌లా జగన్‌కు షో చేయడం రాదు.. టీడీపీ వేసే ముష్టి సీట్ల కోసం పవన్ ఆశపడొద్దు : అంబటి రాంబాబు

ఇక మెదక్ జిల్లాలో 14 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత ఉంది. పటాన్చెరులో 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మహబూబ్నగర్లో అత్యధికంగా 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. కరీంనగర్, నిజామాబాదులోనూ చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. అదిలాబాద్ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏజెన్సీ ఏరియాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తున్నాయి.  అరకు ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పర్యాటకులు రావడానికి భయపడుతున్నారు. చలికాలంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయే లంబసింగిలో ప్రస్తుతం మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

 ఇక్కడ దట్టంగా పొగ మంచు ఉదయం వేళల్లో అలుముకోవడంతో ఘాట్ రోడ్లో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దట్టమైన పొగ మంచుతో మార్గం కనిపించకపోవడంతో రోడ్లపై చలిమంటలు కాగుతూ సేద తీర్చుకుంటున్నారు. పొగ మంచు కమ్మేయడంతో ఎదురుగా ఏం వస్తుందో తెలియని పరిస్థితి. ఇళ్లల్లో ఉన్నా కూడా వేడి దుస్తులు, స్వెట్టర్లు వేసుకుంటే కానీ చిన్నపిల్లలు, వృద్ధులు ఉండలేని పరిస్థితిలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వేడివేడి ఆహారాన్ని తినాలని సూచించారు. 

click me!