డాడీ... డాడీ... నన్ను ఎత్తుకెళ్తున్నారు...: తండ్రితో హేమంత్ చివరి మాటలు

By narsimha lodeFirst Published Sep 25, 2020, 11:35 AM IST
Highlights

అవంతిని పెళ్లి చేసుకొన్న తర్వాత రెండు మూడు దఫాలు తనకు అవంతి కుటుంబం నుండి బెదిరింపులు వచ్చాయని హేమంత్ తండ్రి చెప్పారు. 
 


హైదరాబాద్: అవంతిని పెళ్లి చేసుకొన్న తర్వాత రెండు మూడు దఫాలు తనకు అవంతి కుటుంబం నుండి బెదిరింపులు వచ్చాయని హేమంత్ తండ్రి చెప్పారు. 

శుక్రవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.  అవంతిని ప్రేమించిన విషయమై ముందే తనను హెచ్చరిస్తే తాము అక్కడి నుండి ఇంటిని ఖాళీ చేసేవాళ్లమని హేమంత్ తండ్రి తెలిపారు. పెళ్లైన తర్వాత కూడ బెదిరింపులకు దిగాడు. అయితే అమ్మాయి తండ్రి కాబట్టి బాధ ఉంటుందనే భావనతో తాను ఉన్నానని ఆయన గుర్తు చేసుకొన్నారు.

అయితే ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. అయితే ఈ విషయమై పెద్ద మనుషులకు చెప్పినట్టుగా ఆయన వివరించారు. నిన్న కూడ అవంతి కుటుంబసభ్యులు వచ్చారని హేమంత్ తమకు ఫోన్ చేశాడని చెప్పారు. మాట్లాడేందుకు వచ్చారని భావించామనుకొన్నామన్నారు. వెంటనే తాను తన భార్యను తీసుకొని బైక్ పై చందానగర్ కు బయలుదేరినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.

తనను కారులో తీసుకెళ్తున్నారని డాడీ డాడీ అని తన కొడుకు హేమంత్ చివరగా  అరిచాడని ఆయన గుర్తు చేసుకొన్నాడు. తన కొడుకును తీసుకెళ్లిన  కారును తాను బైక్ పై వెంబడించినట్టుగా ఆయన చెప్పారు. గోపన్ పల్లి తండా వద్ద అవంతి కారు నుండి జంప్ చేసిందన్నారు. ఆ తర్వాత హేమంత్ ను కూడ కారు నుండి లాగిందన్నారు. ఇద్దరు పారిపోతున్న సమయంలో మరో కారులో తన కొడుకును తీసుకెళ్లారని ఆయన చెప్పారు.

also read:కారు నుండి జంప్, పారిపోతుండగా పట్టుకెళ్లారు: హత్యకు గురైన హేమంత్ భార్య అవంతి

అవంతి కుటుంబానికి ఉన్న ఆస్తులు తమకు లేకపోవచ్చు. కానీ సంప్రదాయబద్దంగా తాము ఉంటామని ఆయన చెప్పారు. తన కొడుకుకు ఎలాంటి చెడు అలవాట్లు లేవన్నారు.  అవంతి పేరున ఉన్న ఆస్తులను వారి కుటుంబసభ్యులకు రాసి ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు. ఆస్తుల కోసం తాము అవంతి కుటుంబంపై పోరాటం చేస్తామనే అనుమానంతో ఇలా చేశారేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. 

అవంతి కుటుంబానికి చెందిన ఆస్తులు తనకు అవసరం లేదన్నారు. ఇప్పుడు ఏం చేసినా కూడ తన కొడుకు తిరిగి రాలేడని ఆయన కన్నీళ్లు పెట్టుకొన్నారు.కానీ తన కొడుకును చంపిన వారికి శిక్ష పడితే సంతోషిస్తానని హేమంత్ తండ్రి చెప్పాడు...

click me!