అందరి ముందే తన భర్తను కారులో తీసుకెళ్లి హత్య చేశారని పరువు హత్యకు గురైన హేమంత్ భార్య అవంతి చెప్పారు. తన భర్తను హత్య చేసిన తన మేనమామ యుగంధర్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
హైదరాబాద్: అందరి ముందే తన భర్తను కారులో తీసుకెళ్లి హత్య చేశారని పరువు హత్యకు గురైన హేమంత్ భార్య అవంతి చెప్పారు. తన భర్తను హత్య చేసిన తన మేనమామ యుగంధర్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
హైద్రాబాద్ నగర్ లోని చందానగర్ లోని టీఎన్జీఓ కాలనీలో హేమంత్ , అవంతిలు ప్రేమించి మూడు మాసాల క్రితం పెళ్లి చేసుకొన్నారు. అప్పటి నుండి వీరిద్దరూ చందానగర్ లో నివాసం ఉంటున్నారు.
ఈ పెళ్లిని అవంతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. సుమారు 8 ఏళ్ల పాటు తాను హేమంత్ ను ప్రేమించినట్టుగా ఆమె చెప్పారు. హేమంత్ కు ఆస్తులు లేకపోవచ్చు.కానీ తనను బాగా చూసుకొంటాడని భావించి పెళ్లి చేసుకొన్నానని ఆమె చెప్పారు.
పెళ్లై మూడు మాసాలు దాటినా కూడ తన కుటుంబసభ్యుల ప్రవర్తనల్లో మార్పులు రాలేదన్నారు. నిన్న తమ ఇంటికి మూడు కార్లలో తన మేనమామలు వచ్చి తమను తీసుకెళ్లారని అవంతి చెప్పారు.
మా కారులో మేం వస్తామని చెప్పినా కూడ పట్టించుకోకుండా బలవంతంగా వాళ్ల కారుల్లో తీసుకెళ్లారని అవంతి వివరించారు. తమ ఇంటికి కాకుండా మరో రూట్ లో తీసుకెళ్లడాన్ని గమనించి తాను కారు నుండి జంప్ చేశానని ఆమె చెప్పారు. తనతో పాటు తన భర్తను కూడ కారు నుండి బయటకు లాగినట్టుగా ఆమె చెప్పారు. తామిద్దరం రోడ్డుపై పరుగెత్తుకొంటూ వెళ్తుండగా తన మేనమామ యుగంధర్ రెడ్డి మరో కారులో వచ్చి తన భర్త హేమంత్ ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడన్నారు.
also read:ప్రణయ్ హత్య రిపీట్: చందానగర్ లో కూతురి భర్తను చంపించిన తండ్రి
రోడ్డుపై జనం అంతా చూస్తూండగానే ఇదంతా జరిగిందన్నారు. రక్షించాలని తాను అరిచినా కూడ ఎవరూ కూడ పట్టించుకోలేదని ఆమె చెప్పారు. ఈ విషయమై తాను 100 డయల్ చేశానని ఆమె చెప్పారు. హేమంత్ తల్లిదండ్రులు కూడ పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. పోలీస్ పెట్రోలింగ్ వాహనం వచ్చే సమయానికి తమ కుటుంబసభ్యులు వెళ్లిపోయారన్నారు.తమకు గ్రామస్తులు ఎవరైనా సహాయం చేస్తే హేమంత్ బతికేవాడని ఆమె అభిప్రాయపడ్డారు.
తన భర్తను చంపిన యుగంధర్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని కోరారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు ఎవరికీ కావొద్దన్నారు. తన తల్లిదండ్రులతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్నవాళ్లను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.