దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ఇవాళ హాజరుకానున్నారు. ఈ మేరకు వీసీ సజ్జనార్ కి త్రిసభ్య కమిటీ సమన్లు జారీ చేసింది.
హైదరాబాద్: దిశ (Disha accused encounter)) నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు(supreme court) ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ త్రిసభ్య విచారణ (Sirpurkar Commission) కమిటీ ముందు ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (V.C. Sajjanar) బుధవారం నాడు హాజరు కానున్నారు.
విచారణ కమిటీ ముందు హజరు కావాలని సజ్జనార్ కి త్రిసభ్య కమిటీ సమన్లు జారీ చేసింది. ఎన్ కౌంటర్ జరిగిన విధానం, ఎన్కౌంటర్ లో మరణించిన నిందితుల కుటుంబ సభ్యుల ఆరోపణలపై కమిషన్ విచారణ చేయనుంది.దిశ నిందితుల మృతదేహలను పంచనామా చేసిన మేజిస్ట్రేట్ ను కూడ కమిషన్ విచారించింది. సజ్జనార్ ను విచారించిన తర్వాత ఈ ఎన్ కౌంటర్ పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు చీఫ్ గా వ్యవహరించిన మహేష్ భగవత్ ను కూడ కమిషన్ విచారించనుంది.
2019 డిసెంబర్ 6వ తేదీన షాద్నగర్ కి సమీపంలోని దిశ అత్యాచారానికి గురై, హత్య జరిగిన ప్రదేశంలోనే నిందితులు ఎన్ కౌంటర్ కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే సమయంలోనే నిందితులు తప్పించుకొనే ప్రయత్నం చేయడంతో పాటు పోలీసులపైకి కాల్పులు జరపడంతో నిందితులపై తాము కాల్పులు జరిపినట్టుగా పోలీసులు అప్పట్లో ప్రకటించారు.ఈ ఘటనపై హక్కుల సంఘం నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు.