తన నియోజకవర్గంలో ఏ అధికారులు పనిచేయాలనేది.. అతడే నిర్ణయిస్తాడని, అతడి ఆశీస్సులు లేకుండా పోలీసులకు ఎక్కడా పోస్టింగ్ లు దక్కవని స్థానికులు చెబుతుంటారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయా అధికారులు ఇతడు ఏ అరాచకాలకు పాల్పడినా నోరుమెదపరు అనేది బాధితుల ఆరోపణ. వారి ఉదాసీనతే నాలుగు నిండు ప్రాణాలను బలి తీసుకుంది అనేది తాజా ఆరోపణ.
కొత్తగూడెం : రాజకీయ నీడన సాగే చాటుమాటు అరాచకాలకు పరాకాష్ఠ ఇది. అధికారం మాటున ఓ సామాన్యుడి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా… ఆస్తి వివాదానికి బాధితుడి భార్యను ఫణంగా పెట్టమన్న దారుణం ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు అసలు కారణం కొత్తగూడెం ఎమ్మెల్యే Vanama Venkateswara Rao కుమారుడైన వనమా రాఘవేంద్ర రావు అలియాస్ రాఘవ (59) అని తేలింది.
Ramakrishna commits suicideకు ముందు తీసుకున్న Selfie video రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన ఆత్మహత్య తో పాటు భార్యాబిడ్డల్ని సైతం చంపుకునేందుకు vanama raghavendra rao బెదిరింపులే కారణమని బాధితుడు ఆ వీడియోలో ఆరోపించడంతో రాష్ట్రవ్యాప్తంగా దుమారం చెలరేగింది. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలంటూ భాజపా, కాంగ్రెస్ ఆందోళనకు దిగాయి.
అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాజా ఉదంతం అనంతరం రాఘవ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తండ్రి శాసనసభ్యుడు, మాజీ మంత్రి కావడం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనియర్ నేతగా పట్టు ఉండడంతో నియోజకవర్గంలో రాఘవ అరాచకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి.
తన నియోజకవర్గంలో ఏ అధికారులు పనిచేయాలనేది.. అతడే నిర్ణయిస్తాడని, అతడి ఆశీస్సులు లేకుండా పోలీసులకు ఎక్కడా పోస్టింగ్ లు దక్కవని స్థానికులు చెబుతుంటారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయా అధికారులు ఇతడు ఏ అరాచకాలకు పాల్పడినా నోరుమెదపరు అనేది బాధితుల ఆరోపణ. వారి ఉదాసీనతే నాలుగు నిండు ప్రాణాలను బలి తీసుకుంది అనేది తాజా ఆరోపణ.
విలన్ పాత్రలకు నకలు…
వనమా రాఘవేంద్రరావు అలియాస్ రాఘవ దాదాపు మూడు దశాబ్దాలుగా కొత్తగూడెం కేంద్రంగా సాగిస్తున్న ఆగడాలకు అడ్డే లేదు. వాటిని చూస్తే సినిమాల్లో చూపించే విలన్ పాత్రలెన్నో గుర్తుకు వస్తాయి. ఆయన వేలు పెట్టని వివాదమే ఉండదంటే అతిశయోక్తి కాదు. తండ్రి వనమా వెంకటేశ్వరరావు శాసనసభ్యులు కావడం, కొంతకాలం మంత్రిగా కూడా పని చేసి ఉండటంతో అధికార యంత్రాంగం కూడా రాఘవేంద్రరావు కొమ్ముకాసేది అనేది నిర్వివాదాంశం.
అధికారికంగా రాఘవపై ఆరు కేసులే నమోదయ్యాయి. కానీ నమోదు కాని దురాగతాలకు అంతేలేదు. కొత్తగూడెం నియోజకవర్గంలోనే కాదు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అతని అరాచకాలపై పెద్ద చర్చే జరుగుతుంటుంది. ఆయన తండ్రి శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటినుంచి.. తన నియోజకవర్గం పరిధిలో అధికారుల బదిలీలు మొదలు భూ వివాదాలు, ఆస్తి వ్యవహారాలే కాదు… చివరకు వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ కలహాల్లో కూడా తలదూర్చేవాడన్న ఆరోపణలు ఎన్నో ఉన్నాయి.
నాటినుంచే ఆగడాలు…
- రాఘవపై 2006లో అధికారికంగా మొదటి కేసు నమోదు అయింది. అంతకు ముందు దాదాపు దశాబ్దం ముందు నుంచే అతని ఆగడాలు మొదలయ్యాయి.
- 2006లో పాలకోయతండాలో ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురైంది, వాటిని తొలగించేందుకు రెవెన్యూ, పురపాలక అధికారులు వెళ్లారు. అక్కడికి వచ్చిన రాఘవ వారితో దురుసుగా ప్రవర్తించడంతో తొలి కేసు నమోదయింది. ఇది ఇంకా విచారణ దశలోనే ఉంది.
- 2013లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మద్యం, డబ్బులు పంపిణీ పై రెండు కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఆపినా పట్టించుకోకుండా వాహనంలో దూసుకెళ్లారు. ఇదే ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు, చీరలు పంపిణీ చేస్తుండగా అడ్డుకోబోయిన ప్రభుత్వ ఉద్యోగులతో దురుసుగా వ్యవహరించారు. ఈ దౌర్జన్యంపై మరో కేసు నమోదు కాగా న్యాయస్థానంలో విచారణ తర్వాత కొట్టివేశారు.
- 2017 లో ఓ ధర్నా సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని నమోదైన కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.
- 2020లో పాల్వంచ సోనియా నగర్ లో భూక్య జ్యోతి అనే మహిళకు చెందిన భూవివాదంలో ఎమ్మెల్యే తనయుడు జోక్యం చేసుకోవడం రచ్చకు దారితీసింది. జ్యోతిపై అతని అనుచరులు దాడి చేయగా తీవ్రంగా గాయపడింది. బాధితురాలు మంత్రి సత్యవతి రాథో,డ్ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
వడ్డీ వ్యాపారి ఆత్మహత్య..
- 2021 జూలైలో పాల్వంచ కు చెందిన వడ్డీ వ్యాపారి మల్లిపెద్ది వెంకటేశ్వర్లు రూ. 50 లక్షలకు చీటీ పాడారు. నిర్వాహకుడు డబ్బుకు బదులు స్థానిక బొల్లోజు గూడెంలో ఫ్లాట్ ను రాసిచ్చాడు. అదే స్థలాన్ని మరో వ్యక్తికి కూడా రాసి ఇవ్వడం వివాదానికి దారి తీసింది. ఈ ఉదంతంలో రాఘవ బెదిరింపులతో బాధితుడిపైనే పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జైలుకు వెళ్లిన వెంకటేశ్వర్లు బయటికి వచ్చాక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి కారణం వనమా కుమారుడు అని లేఖ రాశాడు.
- తాజాగా రాఘవ కారణంగా పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
పోలీసు, న్యాయ న్యాయవ్యవస్థకు సహకరిస్తా : వనమా
రామకృష్ణ ఆత్మహత్య ఉదంతం దిగ్భ్రాంతికి గురి చేసిందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ‘బాధితుడు విడుదల చేసిన సెల్ఫీ వీడియో నన్నెంతో కలచి వేసింది. ఆయన నా కుమారుడిపై పలు ఆరోపణలు చేశారు. ఈ కేసులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేంతవరకు నా కుమారుడిని నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఓ ఎమ్మెల్యేగా, బాధ్యత గల తండ్రిగా నిర్ణయించాను. పోలీసులు, న్యాయ వ్యవస్థకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తా. నేనే రాఘవేంద్రరావును పోలీసులకు అప్పగిస్తాను. గతంలో కాంగ్రెస్ లో ఉన్నా. ఇప్పుడు తెరాసలో కొనసాగుతున్నా నా కొడుకు ఓ సామాన్య కార్యకర్త గానే ఉన్నాడు. అతడిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నేనెప్పుడు ఏ వ్యవస్థను ప్రభావితం చేయలేదు’ అన్ని నియోజకవర్గ ప్రజలకు ఒక బహిరంగ లేఖలో తెలిపారు.
పోలీసుల అదుపులో రాఘవ?
నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనకు ప్రధాన కారకుడిగా కేసు నమోదైన రాఘవేంద్రరావు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్ సరిహద్దుల్లో అతన్ని అదుపులోకి తీసుకుని కొత్తగూడెం తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. తండ్రి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కొంతమంది తెరాస నేతలు స్వయంగా పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. గురువారం రాత్రి కొత్తగూడెం తీసుకొచ్చి శుక్రవారం ఉదయాన్నే న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.
ఇంకా దొరకలేదు అన్న ఏఎస్పి : రాఘవేంద్రరావు ఇంకా తమకు దొరకలేదని గురువారం రాత్రి ఏఎస్పీ rohit raj విలేకరులకు చెప్పారు. అతనికోసం తెలుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నట్లు తెలిపారు. 8 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అతనిపై అభియోగాలకు ఆధారాలు లభిస్తే రౌడీషీట్ నమోదు చేస్తామని తెలిపారు.