
Hanumantha Rao: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో అసమ్మతి సెగలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎప్పుడూ ఏదో వివాదంతో స్వంత పార్టీ నేతలే విమర్శనాస్త్రాలు సంధించుకుంటారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కించపరుస్తూ మాట్లాడటం సరికాదనీ. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, ప్రాంతీయ పార్టీ కాదన్న విషయం రేవంత్ గుర్తుపెట్టుకోవాలని చురకలంటిచారు. ఇతరులను కించపరుస్తూ మాట్లడటం.. కాంగ్రెస్ సంస్కృతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న బీహార్ సివిల్ సర్వీసెస్ అధికారులు కాంగ్రెస్ హయాంలోనే వచ్చారని గుర్తుచేశారు. తెలంగాణలో దాదాపు 20 లక్షల మంది బీహారీలు పనిచేస్తున్నారనీ, తెలుగువాళ్లు కూడా వెళ్లి బీహార్లో పనిచేస్తున్నారని వీహెచ్ అన్నారు. రేవంత్ వ్యాఖ్యలను చాలా మంది రాజకీయన నేతలు ఖండిస్తున్నారనీ, ఈ విషయంలో తనకు బీహార్ నుంచి అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు.
నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వడం తమకు ఇష్టలేకపోయినా.. సోనియాగాంధీ నిర్ణయాన్ని గౌరవించామని, ఆమె మాటకు కట్టుబడి ఉంటున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డితో కలిసి పని చేయాలని లేదని స్పష్టం చేశారు. ఆయన వ్యవహర శైలి అనేక సార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. ఎన్నిసార్లు చెప్పినా రేవంత్ రెడ్డి మారడం లేదనీ, ఆయన ఒంటెత్తు పోకడలతో దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి వచ్చిన వారినే రేవంత్ ప్రోత్సహిస్తున్నాడని తప్పుపట్టారు. టీ కాంగ్రెస్ను టీడీపీ కాంగ్రెస్గా మారుస్తున్నాడని రేవంత్ రెడ్డిపై వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు ఎవరున్నా.. పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్తామని, పిండాలు పెట్టే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదని చెప్పారు. రేవంత్రెడ్డి తీరు, మాటలు, ప్రవర్తనతో పార్టీకి ప్రజలు దూరమయ్యే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్పై ఎంఐఎం అధినేత ఒవైసీ ఆగ్రహం
అటు.. ఐఏఎస్ల అధికారులపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం ఆయన స్పందిస్తూ.. ఐఏఎస్లు, ఐపీఎస్లు తమకు కేటాయించిన క్యాడర్లో పనిచేస్తారని తెలిపారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలు వారి మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని, తెలంగాణలో ప్రాంతీయ వాదానికి చోటులేదని చెప్పారు. ఒక్కసారి గండిపేట నీళ్లు తాగితే వాళ్లంతా ఇక్కడివాళ్లయిపోతారని తెలిపారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించే కాంగ్రెస్ అటు కేంద్రంలోనూ.. ఇటు తెలంగాణలో పతనం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.