సిరిసిల్లలో పర్యటించిన అమెరికా చేనేత నిపుణురాలు: నేతన్నల పనితీరుపై అబ్బురపడిన కైరా

By narsimha lodeFirst Published Dec 5, 2022, 8:42 PM IST
Highlights

అమెరికాకు చెందిన చేనేత నిపుణురాలు  కైరా జాఫ్  సోమవారంనాడు సిరిసిల్లలో  పర్యటించారు.  చేనేత కార్మికుల నైపుణ్యాన్ని  కైరా పరిశీలించారు.
 

కరీంనగర్:  అమెరికాకు చెందిన చేనేత నిపుణురాలు కైరా జాఫ్  సోమవారంనాడు సిరిసిల్లలో  పర్యటించారు.   ఆసియా ఖండంలోని వివిధ దేశాల్లో చేనేత పరిస్థితులు నైపుణ్యం వంటి రంగాలపైన సమగ్రమైన అధ్యయనం చేస్తుంది కైరా. తన అధ్యయనంలో భాగంగా ఇవాళ ఆమె సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. 

ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న పరిస్థితులపై ముఖ్యంగా అక్కడి చేనేత పరిశ్రమపై  తన అధ్యయనాన్ని ఆమె పూర్తిచేసుకుంది.  దేశంలోని తెలంగాణ,తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒరిస్సా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆమె తన అధ్యయనాన్ని కొనసాగించనున్నారు.  రాష్ట్రంలోని చేనేత కార్మిక క్షేత్రాలైన పోచంపల్లి, గద్వాల్ , సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ వంటి ప్రాంతాలలో పర్యటించనున్నారు. సిద్దిపేటలోని సెరికల్చర్ రైతులతో క్షేత్రస్థాయి పర్యటన ముగించుకొని ఆమె సిరిసిల్లలోని నేతన్నల తో సమావేశమయ్యారు.

సిరిసిల్ల పట్టణంలో ఉన్న పలువురు చేనేత కార్మికులతో ఆమె మాట్లాడారు. మగ్గాలు నేస్తున్న  కార్మికుల నైపుణ్యాన్ని ఆమె పరిశీలించారు. చేనేత నైపుణ్యాలకు సంబంధించిన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.చేనేత కళ నుంచి మరమగ్గాలవైపు సిరిసిల్ల నేతన్నలు మళ్ళిన చారిత్రాత్మక క్రమంపై కూడా ఆమె వివరాలు తీసుకున్నారు.తన వినూత్నమైన చేనేత ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన హరిప్రసాద్ ను కూడా ఆమె కలిశారు. ఆయన రూపొందించిన వివిధ చేనేత ఉత్పత్తులను ముఖ్యంగా అగ్గిపెట్టెలు పట్టేలా నేసిన చీరను చూసి ఆమె అబ్బురపడ్డారు.

ఇంత అద్భుతమైన ప్రతిభ నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులను ఇంతవరకు తాను చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.సిరిసిల్ల పట్టణంలో ఉన్న చేనేత కార్మికుల నైపుణ్యంతో పాటు ఒక పవర్ లూమ్ క్లస్టర్ గా మారిన తీరు పట్ల కైరా హర్షం వ్యక్తం చేశారు. సంక్షోభం నుంచి  నేతన్నలు స్వయం సమృద్ధి వైపు సాగుతుండడం పై ఆమె ఆసక్తి చూపారు.కైరా వెంట తెలంగాణ మర మగ్గాలు, జౌళి అభివృద్థి కార్పొరేషన్‌ అధ్యక్షులు గూడూరి ప్రవీణ్‌, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి తదితరులు ఉన్నారు.
 

click me!