
సింగరేణి కార్మికుల కష్టాలు, సంస్థ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి పరిస్ధితి మారాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని తాకట్టు పెట్టాలని అనుకుంటున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్ది ఒక జిమ్మిక్కు మాత్రమేనని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో బొగ్గు గనులు వేలం వేస్తుంటే అందులో పాల్గొని సింగరేణికి వాటిని దక్కేలా చేయకుండా.. విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని కిషన్ రెడ్డి చురకలంటంచారు. సింగరేణిలో అంతర్గత ప్రైవేటీకరణ, ఔట్ సోర్సింగ్, అద్వన్నమైన ఆర్ధిక వ్యవస్థ, గనుల్లో భద్రత లోపించిందని ఆయన ఆరోపించారు. కోల్ ఇండియాలో పనిచేసే కార్మికులకు 930 రూపాయల వేతనం వుంటే.. సింగరేణిలో పనిచేసే వారికి కేవలం 420 మాత్రమే వేతనంగా ఇస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కార్మిక సంఘాలు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణపై నరేంద్ర మోడీ ఎలాంటి వివక్ష చూపలేదని ఆయన అన్నారు.
ALso Read: కేంద్రం అందించే సహకారం అందిపుచ్చుకునే ఆలోచన లేదు.. కేసీఆర్పై కిషన్ రెడ్డి ఫైర్
అంతకుముందు సోమవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు రాష్ట్రం అభివృద్ది చెందాలని లేదని విమర్శించారు. కేసీఆర్కు కేంద్రాన్ని విమర్శించడమే తెలుసునని మండిపడ్డారు. కేంద్రం అందించే సహకారం అందిపుచ్చుకునే ఆలోచన లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో బీఆర్ఎస్ మీటింగ్ పెడతారట.. కానీ ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే మాత్రం ఆయన వచ్చే తీరిక లేదని విమర్శించారు. కేసీఆర్ రంజాన్ సందర్భంగా వేషం మార్చుకుని తిరుగుతారని అన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్పై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం వారి రాజకీయ ప్రయోజనాల కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్పై అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.