
సానుభూతి కోసం టీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శుక్రవారం బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆయన తల్లిని మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కావాలనే టీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తమకు అసలు అవసరమే లేదని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన కూడా లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కవితను బీజేపీలోకి చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నామని.. కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులను బీజేపీలోకి చేర్చుకోవాలని.. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని కానీ తమకు లేదన్నారు. బీజేపీకి తెలంగాణ సమాజం అండగా వుంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చి.. నరేంద్ర మోడీ నాయకత్వంపై విశ్వాసం వున్న వారినే బీజేపీలోకి చేర్చకుంటామని కేంద్ర మంత్రి అన్నారు. పలు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను టీఆర్ఎస్లోకి చేర్చుకోవడమే కాకుండా... కనీసం వారితో రాజీనామా కూడా చేయించలేదని కేసీఆర్పై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
భయపెట్టి పార్టీలో చేర్చుకునే సంస్కృతి బీజేపీకి లేదన్నారు. అలాంటి కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల గురించి.. నైతిక విలువల గురించి వీడియోలు చేసి దేశవ్యాప్తంగా పంపిస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపులపై మొట్టమొదటి కేసు పెట్టాలంటే కేసీఆర్ మీదనే పెట్టాలని కేంద్ర మంత్రి అన్నారు. టీఆర్ఎస్ నిరాశతోనే తమపై దాడులకు తెగబడుతోందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Also REad:మీ దాడులకు మేం భయపడం... ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మీ
కాగా.. బీజేపీ సీనియర్ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి ఘటన తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. దీనిపై టీఆర్ఎస్- బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే అర్వింద్, కల్వకుంట్ల కవితల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి.
అంతకుముందు తన ఇంటిపై దాడిపై ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. దమ్ముంటే తనపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కవితకు సవాల్ విసిరారు. ఇంకా దొరల పాలన సాగుతుందని అనుకొంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. హైద్రాబాద్ లోని తన ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసి మహిళలను భయపెట్టారని, తన తల్లిని బెదిరించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. నిజామాబాద్ పార్లమెంట్ లో పోటీచేస్తావా చేయాలని కవితకు అరవింద్ సవాల్ చేశారు. విమర్శలు చేస్తే దాడి చేస్తారా అని అర్వింద్ ప్రశ్నించారు
గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో పోటీచేసిన 178 మందిలో 71 మంది పసుపు రైతులు బీజేపీలో చేరారన్నారు. తనపై చీటింగ్ కేసు ఏం వేస్తావని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది టీఆర్ఎస్ అని అర్వింద్ విమర్శించారు. కేసీఆర్ పై చీటింగ్ కేసు పెట్టాలని కవితకు సలహా ఇచ్చారు ఎంపీ అర్వింద్. రైతులు గుంపులు గుంపులుగా బీజేపీలో చేరుతున్నారన్నారు. 0 ఏళ్ల వయస్సున్న తన తల్లిని భయపెట్టే హక్కు ఎవరిచ్చారని అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.