
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగం కాకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్కు ప్రధాని కార్యాలయం ఎలాంటి సందేశం పంపలేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ప్రధాని హైదరాబాద్లో పర్యటించినప్పుడు కార్యక్రమాలలో సీఎం కేసీఆర్ భాగం కాకూడదని PMO సందేశం పంపినట్లు ఆయన కుమారుడు కేటీఆర్ పేర్కొన్నారని జితేంద్ర సింగ్ చెప్పారు. అయితే అది పూర్తిగా అవాస్తవం అని జితేంద్ర సింగ్ తెలిపారు. పీఎంవో నుంచి అలాంటి సందేశం పంపలేదని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
వాస్తవానికి.. ఫిబ్రవరి 5న ప్రధాని హైదరాబాద్కు వచ్చినప్పుడు జరిగే కార్యక్రమాలలో తెలంగాణ సీఎం ఉంటారని భావించినట్టుగా జితేంద్ర సింగ్ చెప్పారు. అయితే సీఎంకు ఆరోగ్యం బాగోలేదని.. అందుకే హాజరు కావడం లేదని సీఎం కార్యాయలం పీఎంవోకు తెలియజేసిందని పేర్కొన్నారు.
ఇక, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో హైదరాబాద్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ముచ్చింతల్లోని రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్న మోదీ.. సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే మోదీ పర్యటను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోదీకి కనీసం స్వాగతం పలకకుండా.. కేసీఆర్ ప్రోటోకాల్ ఉల్లంఘించారనే విమర్శలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే గతంలో హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సందర్శనకు మోదీ వచ్చిన సమయంలో కూడా కేసీఆర్ కనిపించలేదు.
ఇక, ఈ రెండు సందర్భాల్లో ప్రధాని మోదీ పర్యటనల్లో కేసీఆర్ హాజరుకాకపోవడంపై.. ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ స్పందిస్తూ.. ఆ రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రిని రావద్దని ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టమైన సందేశం పంపిందని చెప్పారు. ఇది పీఎంవో ప్రోటోకాల్ ఉల్లంఘించినట్టు కాదా అని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి వల్ల ఓ ముఖ్యమంత్రికి జరిగిన అవమానం కాదా అని ప్రశ్నించారు.
అదే ఇంటర్వ్యూలో గవర్నర్ జిల్లాల పర్యటనలో ప్రోటకాల్ ఉల్లంఘనలపై కూడా కేటీఆర్ సమాధానమిచ్చారు. ‘‘గవర్నర్ బీజేపీ నాయకురాలిలా వ్యవహరిస్తారు. మంత్రివర్గం ఆమోదించని ప్రసంగాన్ని ఆమె రిపబ్లిక్ డే రోజున చదివారు. అంతేకాకుండా ఆమె రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని చెప్పారు. ఈ మేరకు ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది.