
హైదరాబాద్ బాచుపల్లి ప్రాంతంలో ఓ కాలనీలో ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఘోర సంఘటన స్థానికులను, పోలీసులను షాక్కు గురిచేసింది. ఓ బ్యాగులో గుర్తుతెలియని యువతి మృతదేహం ఉండటంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలో ఓ గుర్తు తెలియని బ్యాగులోంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బ్యాగు తెరిచి చూడగా అందులో ఓ యువతి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటం గమనించారు.
పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం, ఆ యువతికి 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండొచ్చని అంచనా. ఆమె మెడకి నూలు తాడుతో గట్టిగా చుట్టి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె వేసుకున్న దుస్తుల ప్రకారం, ఉత్తరాది ప్రాంతానికి చెందిన యువతిగా భావిస్తున్నారు. మృతదేహంపై ఉన్న మెరూన్ రంగు పంజాబీ డ్రెస్సు, చేతులకు ఉన్న గాజులు ఆధారంగా అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు.
అయితే ముఖం పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల అంచనా ప్రకారం ఈ హత్య సుమారు పదిరోజుల క్రితం జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.బాచుపల్లి సమీపంలో ఫార్మా కంపెనీలు, ఇతర పరిశ్రమలు అధికంగా ఉండటం, పలు రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలుంటుండటంతో, హంతకులు యువతిని హత్య చేసి బ్యాగులో కుక్కి వాహనంలో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అత్యాచారం అనంతరం హత్య జరిగి ఉండొచ్చని మరో కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతం పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి మృతురాలిని గుర్తించేందుకు, హంతకుల వివరాలు కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.