
టి.ఆర్.ఎస్ (trs) నాయకులు, పోలీసుల వేధింపులకు తాళలేక కామారెడ్డిలో (kamareddy) ఆత్మహత్య చేసుకున్న మెదక్ జిల్లా (medak district) రామయంపేటకు సంతోష్, పద్మా కుటుంబాలను టీటీడీపీ (ttdp) అధ్యక్షుడు బక్కని నర్సింహులు (bakkani narasimhul) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ టీడీపీ తరపున బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. దోషులకు శిక్షపడేలా పార్టీ తరపున పోరాడుతామని నర్సింహులు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) స్పందించి ఈ ఘటనకు కారణమైన టిఆర్ఎస్ నాయకులను, బాద్యులైన పోలీసు అధికారులను తక్షణం సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని నర్సింహులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మెదక్ పార్లమెంటు టిడిపి అధ్యక్షులు ఇళ్లేందుల రమేష్ మాట్లాడుతూ... బాధిత సంతోష్ ,పద్మలను ఎన్నోసార్లు స్థానిక టి.అర్.ఎస్ నేతలు ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. దీనిపై ఎన్నోసార్లు పోలీసులకు, నాయకులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకుకోలేదని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్గా తీసుకొని బాద్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.కె గంగాధర్ రావు మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు బక్కని నర్సింలు, మెదక్ పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి ఇళ్లేందుల రమేష్ , రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి, మెదక్ నియోజకవర్గ ఇంచార్జి ఏ.కె గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
కాగా.. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన పద్మ, ఆమె కుమారుడు సంతోష్ ఈ నెల 11న కామారెడ్డిలోని ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. తల్లి పద్మ వైద్యం కోసం వీరు కామారెడ్డి వచ్చినట్టుగా సమాచారం. అయితే వారు ఉంటున్న రూమ్లోనే నిప్పంటించుకున్నారు. వారి గది నుంచి తెల్లవారుజామన పొగలు రావడం గమనించి లాడ్జి సిబ్బంది.. పోలీసులుకు సమాచారమిచ్చారు.
డోర్ ఓపెన్ చేసి చూడగా ఇద్దరు కాలిన గాయాలతో కనిపించారు. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరించారు. అయితే అప్పటికే వారిద్దరు చనిపోయినట్టుగా వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు పద్మ, సంతోష్లు ఓ సెల్పీ వీడియో తీసుకున్నారు. అయితే అందులో ఏం చెప్పారనేది తెలియాల్సి ఉంది. ఇక, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, డీఎస్పీ సోమనాథం.. అక్కడికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కామారెడ్డిలోనే అంత్యక్రియలు నిర్వహించాలని బంధువులకు సూచించారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తల్లి, కొడుకు ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన వీడియోను ఫేస్బుక్లో పెట్టినట్టుగా డీఎస్పీ వెల్లడించారు. మరోవైపు పోలీసులు సూసైడ్ నోట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక, తాము ఆత్మహత్య చేసుకోవడానిక ఏడుగురు కారణమని మృతులు సూసైడ్ నోటులో పేర్కొన్నారు. తాము చనిపోవడానికి రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేధింపులే కారణమని ఆరోపించారు. వ్యాపారంలో 50 శాతం వాటా ఇవ్వాలని బెదిరింపులకు గురిచేశారని సంతోష్ వీడియోలో చెప్పారు.
‘శ్రీను అనే వ్యక్తితో కలిసి నేను వ్యాపారం చేశాను. శ్రీను వద్ద డబ్బులు లేకపోతే జితేందర్ గౌడ్ ఇచ్చాడు. తర్వాత వ్యాపారంలో 50శాతం వాటా కావాలని జితేందర్ గౌడ్ కోరాడు. అయితే డబ్బులు లేవని చెప్పడంతో.. ఓ వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెడితే నన్ను పీఎస్కు పిలిచారు. నా ఫోన్ను అప్పటి సీఐ నాగార్జున గౌడ్ తీసుకున్నాడు. నన్ను కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారు’ అని సంతోష్ వీడియోలో పేర్కొన్నాడు.
మున్సిపల్ చైర్మన్తో కలిసి అప్పటి రామాయం పేట సీఐ నాగార్జున గౌడ్ వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వెనక్కి తగ్గారని.. ఏడాది పాటు తనను వేధించారని చెప్పాడు. తన వ్యాపారం జరగకుండా చేశారని సంతోష్ సెల్పీ వీడియోలో తెలిపాడు. దీంతో తాను అర్థికంగా నష్టపోయానని.. అప్పులు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారని అన్నాడు. వీడియోలో తల్లి, కొడుకులు కన్నీరు పెట్టుకుంటూ వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ వీడియో కన్నీరు పెట్టించేలా ఉంది. ఇక, గతంలో 20 పేజీలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని సంతోష్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.