
హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు నాలుగు వైపులా ఉన్న బస్టాపులను అనుసంధానం చేస్తూ మినీ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మినీ బస్సులో కేవలం రూ.5 టికెట్తో ప్రయాణికులు ఒక బస్టాప్ నుంచి మరో బస్టాప్ వరకు వెళ్లే విధంగా ఏర్పాట్టు చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత ఒక బస్సును ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ఇది ముఖ్యమంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ప్రయాణించేవారికి ఇది పెద్ద ఊరట కలిగించే విషయమనే చెప్పాలి.
ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో నిత్యం రద్దీగా ఉంటాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికుల్లో చాలా మంది.. స్టేషన్ పరిసరాల చుట్టూ ఉన్న ఓ బస్టాపుల్లో దిగి.. కాలినడన మార్గంలో ఇతర బస్ స్టాపులకు చేరుకుంటున్నారు. ఆ కొద్ది పాటు దూరం ఆటోలో వెళ్లాలంటే.. భారీగా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చుట్టూ ఉన్న బస్టాపుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఘట్కేసర్, బోడుప్పల్, ఎల్బీ నగర్.. వైపు నుంచి వచ్చే బస్సులు చాలా వరకు చిలకలగూడ చౌరస్తాకే పరిమితమవుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల నుంచి అల్వాల్, బోయిన్పల్లి, అమీర్ పేట వైపు వెళ్లాలనుకునే చాలా మంది ప్రయాణికులు చిలకగూడలో దిగి.. నడక మార్గంలో ఇతర బస్టాప్లకు చేరుకుంటున్నారు. మరోవైపు మల్కాజిగిరి, ఈసీఐఎల్ వైపు నుంచి వచ్చే బస్సులు బ్లూసీ హోటల్ ఎదురుగా ఉన్న బస్టాపులకే పరిమితం అవుతున్నాయి. అక్కడ దిగిన వాళ్లు రైల్వేస్టేషన్కు వెళ్లాలన్నా, చిలకలగూడ క్రాస్రోడ్కు వెళ్లాలన్నా ఒకటిన్నర కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. అల్వాల్, బోయిన్పల్లి, జీడిమెట్ల, బాలానగర్, పటాన్చెరు, తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు సికింద్రాబాద్ గురుద్వారాకే పరిమితం అవుతున్నాయి. అక్కడ దిగి అటు బ్లూసీ వైపు, ఇటు చిలకలగూడ వైపు వెళ్లేవారు నడకమార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది. ఆర్టీసీ తాజా నిర్ణయంతో ఇలాంటి వారికి భారీ ఊరట కలగనుంది.