#RTC strike తీర్పు కాపీ అందేవరకు.. సమ్మె కొనసాగుతుంది: అశ్వత్థామరెడ్డి

Siva Kodati |  
Published : Nov 19, 2019, 07:27 PM IST
#RTC strike తీర్పు కాపీ అందేవరకు.. సమ్మె కొనసాగుతుంది: అశ్వత్థామరెడ్డి

సారాంశం

ఆర్టీసీ సమ్మెపై భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతల సమావేశం ముగిసింది. ఈ క్రమంలో కోర్టు తీర్పు కాపీ వచ్చే వరకు వేచిచూస్తామని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి తెలిపారు.

ఆర్టీసీ సమ్మెపై భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతల సమావేశం ముగిసింది. ఈ క్రమంలో కోర్టు తీర్పు కాపీ వచ్చే వరకు వేచిచూస్తామని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి తెలిపారు. అప్పటి వరకు సమ్మె యథావిధిగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని కార్మికులు తెలిపారని.. కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. 

రాష్ట్రంలో బస్సు రూట్లను ప్రైవేటీకరిస్తున్నట్లు తెలంగాణ కేబినెట్ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ కేబినెట్ తీర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సవాల్ చేసిన పిల్ పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. 

Also Read:కేబినెట్ నిర్ణయం తప్పెలా అవుతుంది: బస్సు రూట్లప్రైవేటీకరణపై హైకోర్టు వ్యాఖ్యలు

పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఆ సమయంలో మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం రోడ్డు రవాణ అంశం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనములో ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. 

ఆర్టీసీ, ప్రైవేటు వ్యవస్థలు సమాంతరంగా నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అలాంటప్పుడు కేబినెట్ నిర్ణయం తప్పెలా అవుతుందో చెప్పాలంటూ పిటిషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం ఎలాంటి మార్పులు చేసినా ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు.  

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆర్టీసీ 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రహస్యమని, సెక్రటేరియట్‌ పరిధి దాటి ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి రాష్ట్ర ధర్మాసనానికి స్పష్టం చేశారు. 

బస్సురూట్ల ప్రైవేటీకరణ అంశంపై కేబినెట్‌ నిర్ణయ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడేలోగా ఆ నిర్ణయంలో మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉందన్నారు.  

Also Read #RTC strike సడక్ బంద్ వాయిదా, దీక్ష విరమించిన అశ్వత్థామరెడ్డి: సమ్మెపై రేపు తుది నిర్ణయం

జీవో వచ్చాకే కేబినెట్‌ నిర్ణయానికి పూర్తి సార్థకత వస్తుందని సీఎస్ సీకే జోషి కోర్టుకు తెలిపారు. ఈలోగా కేబినెట్‌ నిర్ణయాన్ని ప్రశ్నించేందుకు వీల్లేదని రాజ్యాంగంలోని 166(1) అధికరణం స్పష్టం చేస్తోందని తెలిపారు. 

రవాణా చట్టం కూడా అదే స్పష్టం చేస్తోందని సీఎస్ సీకే జోషి తెలిపారు. క్యాబినెట్‌ తీర్మానం నోట్‌ఫైల్స్‌లో భాగమని, సచివాలయం బయట ఉన్న వాళ్లకు ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదని తెలిపారు. 

 

PREV
click me!

Recommended Stories

Panic at Hyderabad Gas Stations: యుద్ధం ఎఫెక్ట్! హైదరాబాద్‌లో గ్యాస్ కోసం బారులు | Asianet Telugu
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి | Asianet News Telugu