
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకులకు మరో షాకిచ్చింది. ఇటీవల కాలంలో ఆర్టీసీ ప్రయాణీకులపై షాక్ల మీద షాకులిస్తుంది. తాజాగా టికెట్ అడ్వాన్స్ రిజర్వేషన్లపై చార్జీలను కూడా ఆర్టీసీ పెంచింది.
ఇటీవలనే తెలంగాణ ఆర్టీసీ టికెట్ చార్జీలను పెంచింది. రిజర్వేషన్లపై ప్రతి ప్రయాణీకుడిపై రూ. 20 నుండి రూ.30 పెరగనుంది., 2016 లో చివరిసారిగా అడ్వాన్స్ రిజర్వేషన్ చార్జీలను ఆర్టీసీ పెంచింది.
చిల్లర సమస్యను పరి ష్కరించేందుకు రౌండ్ ఫిగర్ పేరుతో అన్ని సర్వీస్లకు వర్తించేలా మార్చిలో రూ.5 పెంచిన సంస్థ, వారం రోజులు తిరగముందే బస్ పాస్ ధరలను భారీగా పెంచింది. జనరల్ ఆర్టినరీ బస్ పాస్ ధరను రూ.970 నుంచి రూ.1150లకు, మెట్రో ఎక్స్ప్రెస్ ధరను రూ.1070 నుంచి 1300కు పెంచారు. అలాగే మెట్రో డీలక్స్ బస్ పాస్ ధరను రూ.1185 నుంచి రూ.1450లకు, ఏసీ బస్ పాస్ ధరను రూ.2500 నుంచి 3 వేలకు పెంచారు. హైదరాబాద్ మెట్రో పరిధిలో నడిచే అన్ని సిటీ బస్ సర్వీసుల్లో కనీస ధరను రూ.10గా నిర్ణయించారు. డిజిల్ ధరల కారణంగా వస్తున్న నష్టాలు వస్తున్నాయని డిజిల్ సెస్ పేరుతో ఆర్డిన రికి రూ.2, మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ డీలక్స్ కోచ్లకు రూ.5 చొప్పున వడ్డించింది.
పెరుగుతున్న ఇంధన ధరల వల్ల వస్తున్న నష్టాలను అధిగమించేందుకు పెంపు తప్పదని ఆర్టీసీ చెబుతున్నప్పటికి పెరుగుతన్న చార్జీలు నగరంలో కూలీ, నాలీ చేసకునే సామాన్య ప్రజలకు భారంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి టీఎస్ఆర్టీసీకి ప్రత్యేక రాయితీలు ఇచ్చి పెంచిన సిటీ బస్సు చార్జీలను తగ్గించాలని నగర ప్రజలు కోరుతున్నారు
రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత డీజిల్ ధరలు పెరగడంతో టీఎస్ఆర్టీసీపై ఆర్థిక భారం పడిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. . రోజు వారీ ఖర్చులు పెరిగిపోతుండటంతో సంస్థ నష్టాల్ని చవిచూడాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలో పెరిగిపోతున్న డీజిల్ ధరల వల్ల టిఎస్ఆర్టీసీపై ఆర్థిక భారం పడుతోందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రతీరోజూ 6 లక్షల లీటర్ల హెచ్ఎస్డి ఆయిల్ను వినియోగిస్తున్నారు... ఇటీవలి కాలంలో అసాధారణ రీతిలో చమురు ధరలు పెరగడంతో హెచ్ఎస్డి ఆయిల్ ధర కూడా పెరిగిందన్నారు. 2021 డిసెంబర్లో రూ.85 గా ఉన్న హెచ్ఎస్డి ఆయిల్ ధర ఇప్పుడు రూ.118కి చేరిందన్నారు. ఈ కారణంతోనే టికెట్ చార్జీలు పెంచడం అనివార్యమైందన్నారు. గతంలో కష్ట సమాయాల్లో ఆర్టీసీ సంస్థను ఆదరించిన ప్రయాణీకులు ఇప్పుడు కూడా సంస్థను ఆదరించాలని కోరారు.