
హైదరాబాద్: గ్రామీణ శాస్త్రవేత్త, నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన మండాజి నర్సింహాచారి కష్టపడి రూపొందించిన ఇన్స్టాషీల్డ్ వైరస్ కిల్లర్ పరికరాన్ని రాష్ట్రమంత్రి కేటీఆర్ ఈ రోజు ఆవిష్కరించారు. కేటీఆర్ తన నివాసంలో ఈ పరికరాన్ని ఆవిష్కరించి సైంటిస్టు మండాజి నర్సింహాచారిని అభినందించారు. ఈ పరికరాన్ని ఎలా డెవలప్ చేశారని, దాని పని ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఆవిష్కరణలకు తమ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని వివరించారు. ఇంటింటా ఇన్నోవేటర్ పురస్కారానికి నర్సింహాచారి గతంలో ఎంపికయ్యారని, ఇప్పుడు స్వయంగా ఆవిష్కర్తగా ఎదగడం ఆనందంగా ఉందని తెలిపారు.
సైంటిస్టు నర్సింహాచారి మాట్లాడుతూ, ప్రజలను వైరస్ల బారి నుంచి రక్షించడానికి రెండేళ్లు శ్రమించి ఇన్స్టాషీల్డు రూపొందించామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ దీన్ని చేర్చడమే తన జీవిత ఆశయం అని వివరించారు. కరోనా, సార్స్, ఒమిక్రాన్, డెల్టా, ఇతర భావి వైరస్లను ఈ వైరస్ కిల్లర్ సమర్థంగా సంహరిస్తుందని చెప్పారు. తాను రూపొందించిన ఈ ఇన్స్టాషీల్డ్ను సీసీఎంబీ, సీడీఎస్సీవో, వింటా, ఎంటాక్ ల్యాబ్, తదితర సంస్థలు ధ్రువీకరించాయని వివరించారు.
నర్సింహాచారి రాజేంద్రనగర్ సమీపంలో బుద్వేల్లో ఉంటున్నారు. కరోనా మూలాల్ని తెలుసుకుని, అనేక ప్రయోగాలు చేసి ఈ పరికరాన్ని కనుగొన్నాడు. స్వల్ప సమయంలోనే అన్ని రకాల వైరస్లను చంపే పరికరాన్ని తయారు చేశాడు. ఈ మెడికల్ డివైజ్తో దుష్పరిణామాలు ఉండవని సీసీఎంబీ తేల్చిందని చారి వివరించారు. ఆయన పరిశోధనలకు సీసీఎంబీ, టీఎస్ఐసీ సహకరించాయని పేర్కొన్నారు.
ఈ ఇన్స్టాషీల్డ్ వైరస్ కిల్లర్ డివైజ్ సుమారు 5000 స్క్వేర్ ఫీట్ల వరకు పని చేస్తుందని సైంటిస్టు తెలిపారు. కరోనా వైరస్ను చంపడానికి నిర్దిష్టమైన వేవ్లెంత్తో ఎలక్ట్రాన్లను విడుదల చేస్తే అవి వైరస్ను సంహరిస్తాయని వివరించారు. ఈ ఎలక్ట్రాన్లు ఇంటి గోడల నుంచి కూడా బయటకు దూసుకెళ్తాయని, తద్వార వెలుపుల వున్న వైరస్లు కూడా చనిపోతాయని పేర్కొన్ననారు. ఈ డివైజ్ బహుళ ప్రయోజనాల కోసం రూపొందించారని, ఇది నిర్దిష్టమైన వేవ్లెంత్లో కొన్ని ట్రిలియన్లలో నెగెటివ్ ఎలక్ట్రాన్లను వెదజల్లి వైరస్లను చంపేసే పరికరం అని వివరించారు. పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ఆఫీసులు, గృహాలు, మీటింగ్ రూములు, వివాహ కార్యక్రమాలు, బాంక్విట్ హాళ్లు, హోటళ్లు, హాస్పిటళ్లు మొదలైన అన్ని రకాల కమ్యూనిటీ ప్రదేశాల్లో వీటిని ఉపయోగించి ప్రాణవాళిని కాపాడుకోవచ్చని వివరించారు. కరెంట్ కూడా స్వల్పంగా అంటే కేవలం 3.6 వాట్ల కరెంట్ మాత్రమే తీసుకుంటుందని, ఇది మొబైల్ చార్జింగ్ కంటే కూడా తక్కువ అని తెలిపారు.