నన్ను యూజ్‌లెస్ ఫెలో అంటావా, నీ గుండు పగులుద్ది.. బండి సంజయ్‌కి మైనంపల్లి వార్నింగ్

By Siva KodatiFirst Published Aug 15, 2021, 5:41 PM IST
Highlights

తనను రెచ్చగొట్టేలా బండి సంజయ్ వ్యక్తిగత ఆరోపణలు చేశారని... తన గురించి ఏం తెలుసని నన్ను యూజ్‌లెస్ ఫెలో అన్నాడంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హనుమంతరావు ఫైరయ్యారు. ఇంకోసారి మల్కాజ్‌గిరిలో అడుగుపెడితే బండికి గుండు పగులుద్దని ఆయన హెచ్చరించారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మల్కాజిగిరి నుంచి గుండాయిజం చేస్తున్నారని, బండి సంజయ్ చుట్టూ వున్నది భూకబ్జాదారులేనని మండిపడ్డారు. బీజేపీ నేతలు ఓ పోలీస్ అధికారిపై దాడి చేశారని, తమ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారని మైనంపల్లి ఆరోపించారు. 

తనను రెచ్చగొట్టేలా సంజయ్ వ్యక్తిగత ఆరోపణలు చేశారని... తన గురించి ఏం తెలుసని నన్ను యూజ్‌లెస్ ఫెలో అన్నాడంటూ హనుమంతరావు ఫైరయ్యారు. ఇంకోసారి మల్కాజ్‌గిరిలో అడుగుపెడితే బండికి గుండు పగులుద్దని, నేటి నుంచి సంజయ్ భరతం పడతానని మైనంపల్లి వార్నింగ్ ఇచ్చారు. తొందర్లోనే బండి సంజయ్ రాసలీలలు మీడియా ముందు పెడతానని... మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రవణ్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎవరూ దాడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా సంజయ్ తప్పుడు ఆరోపణలు చేశాడని మైనంపల్లి మండిపడ్డారు. బండి సంజయ్ స్థాయి కార్పొరేటర్‌కి ఎక్కువ... ఎంపీకి తక్కువ అని మైనంపల్లి హనుమంతరావు ఎద్దేవా చేశారు.

కాగా, ఎమ్మెల్యే మైనంపల్లి, స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌ల మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే. జాతీయ జెండాలో భారతమాత ఫోటో అంశంపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు బీరు బాటిళ్ళతో దాడి చేశారు. గాయపడిన కార్పొరేటర్ శ్రవణ్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించడానికి వచ్చిన బండి సంజయ్.. మైనంపల్లిపై విరుచుకుపడ్డారు.

click me!