
తెలంగాణకు పట్టిన చీడపీడ కేసీఆర్ను (kcr) పొలిమేరల వరకు తరిమేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మనకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ ఉద్యోగాన్ని పీకేసి శక్తి మీకుందని ఆయన పేర్కొన్నారు. 12 నెలల్లో సోనియా రాజ్యం వస్తుందని.. కొట్లాడినోడికే బీ ఫామ్ ఇస్తామని, ఈసారి కోటాలు వాటాలు లేవని రేవంత్ స్పష్టం చేశారు. తాను 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని.. కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు 12 నెలల సమయమిస్తే.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి (shiv sena reddy) దీక్షను టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) ఆదివారం విరమింపజేశారు. వచ్చే బడ్జెట్లో నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే ఆమరణ దీక్ష చేస్తానని శివసేన రెడ్డి చెబుతున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ నేతలకు అవకాశాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడున్న ఎంతోమంది నేతలు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినవారేనని రేవంత్ గుర్తుచేశారు. యూత్ కాంగ్రెస్ నేతగా వున్న చిన్నారెడ్డి రాజీవ్ గాంధీ (rajeev gandhi) ప్రోత్సాహంతో వనపర్తి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని ఆయన తెలిపారు. యూత్ కాంగ్రెస్లో కొట్లాడినోళ్లు అందరికీ టికెట్లు వస్తాయని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
తెలంగాణ కోసం తొలుత పోరాడింది కాంగ్రెస్ నేతలేనన్న ఆయన.. తర్వాత టీఆర్ఎస్ (trs) వచ్చిందన్నారు. ప్రజలకు ఎలాంటివి మేలు చేస్తాయో ఆ నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీ తీసుకుందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టలేదంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీని చంపుకుని సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారని రేవంత్ తెలిపారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వుంటే.. ప్రజల ఆకాంక్షలు నెరవేరేవన్నారు.
కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని కోతుల గుంపుకు అప్పగించినట్లయ్యిందని రేవంత్ అభివర్ణించారు. తనకు టీపీసీసీ చీఫ్ పదవి కన్నా.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవే ఎక్కువ ఇష్టమన్నారు. కేసీఆర్కు యూత్ కాంగ్రెస్లో (youth congress) పదవి ఇచ్చింది వీ హనుమంతరావేనని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తాను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడినై వుంటే కేసీఆర్కు నిద్రలేకుండా చేసేవాడినని.. ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువత ప్రాణాలు తీస్తోందని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వస్తే లక్షా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని అన్నారని రేవంత్ దుయ్యబట్టారు. తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు పదవులు రాలేదని.. నిరుద్యోగులకు రాలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.