కాంగ్రెస్ కు రేవంతే ఉరితాడు: బాల్క సుమన్

Published : Feb 27, 2022, 04:48 PM IST
కాంగ్రెస్ కు రేవంతే ఉరితాడు: బాల్క సుమన్

సారాంశం

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పరిగి లో పీసీసీ అధ్యక్షుడు కల్లు తాగిన కోతి లా వ్యవహరించారనీ, కాంగ్రెస్ పార్టీ నేత‌లు వ్యవసాయం గురించి మాట్లాడటమంటే దయ్యాలు వేదాలు వల్లించడమేన‌నీ ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ తీవ్ర ఏద్దేవా చేశారు. కాంగ్రెస్ కు రేవంతే ఉరి తాడు గా మారారని విమ‌ర్శించారు.  

తెలంగాణ‌ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై మ‌రోసారి ప్రభుత్వం విప్‌ బాల్క సుమన్‌ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. పరిగి లో పీసీసీ అధ్యక్షుడు కల్లు తాగిన కోతి లా వ్యవహరించారనీ, కాంగ్రెస్ పార్టీ నేత‌లు వ్యవసాయం గురించి మాట్లాడటమంటే దయ్యాలు వేదాలు వల్లించడమేన‌నీ ఏద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఒక కమెడియన్ లా మారి పోయారనీ బాల్క సుమన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో బాల్క సుమన్  మాట్లాడుతూ.. రేవంత్ లో విషం తప్పా …విషయం లేదని, ఈ మధ్య రేవంత్ మాట్లాడిన ఇంగ్లీష్ ను చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. ఇంగ్లీష్ కు ట్యూటర్ ను పెట్టుకుంటే మంచిదనీ, ఆయ‌న‌ బట్లర్ ఇంగ్లీష్ ను భరించ లేకపోతున్నారని సూచించారు. 

రైతు ఆత్మహత్యలు ఎక్కువగా కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి జోకర్ లెక్క మాట్లాడుతున్నాడు…ఒక ట్యూటర్ ను పెట్టుకోవచ్చు కదా అని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎక్క‌డ ఉన్నారని ప్ర‌శ్నించారు. ఆయ‌న ఆ స‌మ‌యంలో  సమైక్య వాదుల చెప్పులు మోశారని విమ‌ర్శించారు. రేవంత్ నోటి వెంట కుంభ కోణాలు తప్ప మరో పదం రావడం లేదనీ. రేవంత్ రెడ్డే.. వేల కోట్ల అవినీతికి పర్యాయ పదమ‌ని ఎద్దేవా చేశారు. 
 
రాహుల్  అఖిల భారత పప్పు అయితే.. రేవంత్ తెలంగాణ కు పప్పు గా తయారయ్యాడని, తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ ను ఎవ్వరూ పట్టించు కోవడం లేదని ఫైర్ అయ్యారు. జైలు లో చిప్ప కూడు తిన్నాక రేవంత్ బ్రేన్లో చిప్ దొబ్బిందనీ, రేవంత్ ను తక్షణమే ఎర్ర గడ్డ మెంటల్ ఆస్పత్రి లో చేర్పించాలని జగ్గా రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఖర్చులుంటే మేము భరిస్తామ‌ని అన్నారు.కాంగ్రెస్ కు రేవంతే ఉరి తాడు గా మారారని విమ‌ర్శించారు.

ఒడిశా లో సింగరేణి కి చెందినకోల్ బ్లాక్ లో 50 వేల కోట్ల కుంభ కోణం జరిగిందంటున్నారు. అస్సలు ఆ నైని కోల్ బ్లాక్ లో బొగ్గు విలువ కూడా 50 వేల కోట్లు లేదని రేవంత్ కు తెలుసా? అని ప్ర‌శ్నించారు. సింగరేణి టర్న్ ఓవర్ ఎంతో రేవంత్ కు తెలుసా.. సింగరేణి సంస్థ ను విమర్శించడం సిగ్గుగా అనిపించడం లేదా అని నిల‌దీశాడు. సింగరేణి ప్రైవేటీకరణ ను పార్లమెంటు లో ప్రశ్నించాల్సింది పోయి బీజేపీ తో కుమ్మకై రేవంత్ కేసీఆర్ ను తిడుతున్నారని మంత్రి బాల్క సుమన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ బీజేపీ కోవర్ట్ అనే అనుమానం కలుగుతోందనీ, ఎన్నికల నాటికి కాంగ్రెస్ సీనియర్లను బయటికి పంపించి కాంగ్రెస్ ను బీజేపీ కి అమ్మే పనిలో రేవంత్ ఉన్నాడ‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలే రేవంత్ కు ఉరి తాడు బిగించే రోజులు చాలా ద‌గ్గ‌ర్లో ఉన్నాయనీ, ఆధార రహితంగా అవినీతి ఆరోపణలు చేసే జోకర్ రేవంత్ అనే సంగతి ఎన్నో సందర్భాల్లో రుజువు అయిందని అన్నారు. 

రేవంత్ తెలంగాణ పాలిట తాలిబన్ : జీవన్ రెడ్డి

అనంత‌రం పియూసీ చైర్మన్ ఏ జీవన్ రెడ్డి మాట్లాడూతూ.. రేవంత్ రెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి పరిగి లో పనికి మాలిన మాటలు మాట్లాడారనీ, వాటిని తెలంగాణ బిడ్డలెవ్వరూ సమర్ధించారు. రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో ఎవ్వరూ గుర్తించడం లేదనీ .అందుకే త‌న ఉనికిని చాటుకునేందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని విమ‌ర్శించారు. ఓటుకు నోటు కేటు గాడు.. పెద్ద పోటు గాడిలా పోజు కొట్టి మాట్లాడుతున్నాడని ఏద్దేవా చేశారు. తుపాకి రాముడి తుప్పు మాటలతో తెలంగాణ‌ కాంగ్రెస్ గానీ,  తెలంగాణ కు ఒరిగేదేమీ లేదనీ అన్నారు.

తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు కొల్ల గొట్టిన పార్టీ ల జెండాలు మోసిన రేవంత్ రెడ్డి .. ఇప్పుడూ .. చిలక పలుకులు ప‌లుకుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బాయిల్డ్ రైస్ కొనమని అన్న కేంద్రాన్ని వదిలేసి.. సీఎం కేసీఆర్ పై నోరు పారేసు కుంటే వచ్చే లాభం ఏమీ లేదని అన్నారు. రేవంత్ తన కార్యక్రమం పేరు.. మన పార్టీ - మన పోరు అని మార్చుకుంటే మంచిదని సూచించారు. రేవంత్ రెడ్డి కి కళ్ళు దొబ్బాయి అందుకే కుళ్లు మాటలు మాట్లాడుతున్నారనీ, తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని, అలాగే.. తెలంగాణ రాష్ట్ర‌ బడ్జెట్ ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా మెచ్చుకున్నారని గుర్తు చేశారు. 

కేసీఆర్ తెలంగాణ బంధు అయితే.. రేవంత్ తెలంగాణ పాలిట తాలిబన్ లా మారారనీ, కాంగ్రెస్ కు ఊరు లేదు పేరు లేదని అన్నారు. అభివృద్ధి తెలంగాణ ప్రజల జన్మ హక్కు అయితే అవినీతి అబద్దాలు రేవంత్ జన్మ హాక్కు లా మారిపోయాయి. కాంగ్రెస్ కు ప్రజలు ఎపుడో ఉరి వేశారని అన్నారు.రేవంత్ వి తుపాకీ రాముడి తుప్పు మాటలని, నీళ్లు నిధులు నియామకాల పై రేవంత్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలనీ, రేవంత్ సన్ ఆఫ్ కరప్షన్ లా మారారని విమ‌ర్శించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరగలేదని రేవంత్ అడిగిన ప్రశ్నకే పార్లమెంటు లో కేంద్రం జవాబిచ్చిందని, అయినా రేవంత్ లోఫర్ లా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పై నోరు పారేసుకుంటే.. రేవంత్ ను ఊరంతా ఉరికించి..ఉరికించి.. కొట్టే రోజులు ఎంతో దూరం లో లేవని హెచ్చ‌రించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉద్యమం లో ఉన్న‌ప్పుడూ రేవంత్ ఏ ఉద్యమం లో  ఉన్నారని ప్రశ్నించారు. 

రేవంత్  రాజకీయాల్లో బచ్చా:  ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 

రేవంత్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడటం చూసి జనం నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రేవంత్ రెడ్డి అవినీతి పరుడు కాక పోతే జూబిలీ హిల్స్ లో ఇన్ని ఇండ్లు, స్థలాలు ఎక్కడివని, రేవంత్ బ్లాక్ మెయిల్ గురించి ఎవ్వరిని అడిగినా చెబుతారనీ,  జూబిలీ హిల్స్ లోనే తిరుగుదాం.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా.. అని స‌వాల్ విసిరారు.
 
టీఆర్ ఎస్ తలచుకుంటే.. రేవంత్ రెడ్డి తన ఇంటి నుంచి కూడా కాలు బయట పెట్టలేరని, కేసీఆర్ కుటుంబం గురించి రేవంత్ మాట్లాడితే ఆయన కుటుంబం కాంగ్రెస్ నేతల కుటుంబాల గురించి మేము మాట్లాడాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాజకీయాల్లో రేవంత్ ఓ బచ్చా అని,  పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ హుందా గా ఉంటే మంచిదని సూచించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్