
ఐదుగురు అధికారుల చేతుల్లో 40 శాఖలున్నాయని.. అధికారుల అండతో సీఎం వేల కోట్లు కొల్లగొడుతున్నారని టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) ఆరోపించారు. ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) అధ్యక్షతన సీఎల్పీ సమావేశం (telangana clp meeting) జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసురించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మనం ఏ పోరాటం చేసినా గృహ నిర్బంధం చేస్తున్నారని.. ఫలక్నుమా నుంచి ఎయిర్పోర్ట్కు మెట్రో వేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్కు మెట్రో వేయడానికి కారణమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మైనార్టీ అభివృద్ధిని కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదేనంటూ రేవంత్ జోస్యం చెప్పారు.
ఇకపోతే.. కేసీఆర్ సర్కార్ తీరుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్లుగా కేసీఆర్ (kcr) వ్యవహారం వుందని ఆయన ఎద్దేవా చేశారు. గవర్నర్ని కూడా బడ్జెట్ సమావేశానికి రాకుండా చేశారని.. గవర్నర్ మాట్లాడకపోతే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవరిస్తారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ సంక్షోభమని.. కేసీఆర్ ప్రజల్ని భ్రమల్లో వుంచుతున్నారని ఆయన దుయ్యబట్టారు. దేశాన్ని బంగారు దేశంగా మార్చుతానని కేసీఆర్ తిరుగుతున్నారని.. ప్రజలు అభివృద్ధి చెందుతారని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని భట్టి గుర్తుచేశారు.
అంతకుముందు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో నిర్ణీత సమయాని కంటే ముందే ఎన్నికలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నేతలు హైద్రాబాద్ ను వదిలి నియోజకవర్గాలకు వెళ్లాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. తాను ఎక్కడి నుండి పోటీ చేయాలనేది సోనియా గాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడాన్ని మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పు బట్టారు. KCR అహంకార ధోరణి కారణంగానే Governor ప్రసంగం లేకుండా చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.కేసీఆర్ తీరును తాను ఖండిస్తున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాజ్యాంగ సంప్రదాయాలను తుంగలో తొక్కడం సరైంది కాదన్నారు. ఈ విషయాన్ని తాను పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని చెప్పారు.
dalitha bandhu పథకాన్ని దళితులకు అందించడం కోసం కనీసం ఈ బడ్జెట్ లో 85 వేల కోట్లు పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దళిత బంధు పథకం కింద లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలన్నింటికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.నిరుద్యోగ భృతి గురించి ఏడాది క్రితం చెప్పారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజా పంపిణీ ద్వారా సన్న బియ్యం సరఫరా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.