
కోదండరాంకు గవర్నర్ పదవి...
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది.
బీజేపీ బుట్టలో కోదండరాం పడిపోయారని అప్పుడే కొందరు మేధావులు కొత్త విశ్లేషణలు కూడా మొదలుపెట్టారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని పార్టీలు రెడ్ కార్పెట్ వేసి పదవులతో గాలం వేసినా పట్టించుకోని ప్రొఫెసర్ ఇప్పుడు పదవులకోసం ఆశపడుతున్నారంటే తెలంగాణ సమాజం నమ్ముతుందా...
కానీ, నమ్మించడానికి కొన్ని శక్తులు శతథా కృషి చేయాల్సి వస్తోంది. అందులో భాగమే కోదండరాంపై ఈ కొత్త కుట్ర.ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీలకు ఇప్పుడు కోదండరాం కంటిలో నలుసుగా తయారయ్యారనేది వాస్తవం.
అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి దుమ్మెత్తిపోసినా ప్రజల నుంచి కనీస స్పందనరావడం లేదు. ఎందుకంటే కోదండరామే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మారిపోయారు. ఆయన ఆందోళనకు దిగితే ప్రతిపక్షాలన్నీ కలిసి ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక రాష్ట్రంలోని అధికార పక్షానికి కూడా ఆయన కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ప్రతిపక్షాలకంటే ఆయనను కట్టడి చేయడానికే గులాబీ నేతలు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది.
రేపు ఆయన జేఏసీతో కలిసి పార్టీ పెడితే ఇక అంతే సంగతి. ఇటు అధికార పార్టీకి, అటు ప్రతిపక్ష పార్టీలకు కొత్త తలనొప్పి మొదలవుతుంది. అందుకే ఆయన గొంతు తెలంగాణలో వినిపించకూడదనుకునే వైరిపక్షాలే కోదండరాం కు గవర్నర్ గిరి అనే కొత్త కుట్రకు తెరలేపారు.
ఇది నిజమని ప్రజలు భావిస్తే జేఏసీకి ప్రజామద్దతు కరువవుతుంది. అందరు మేధావుల్లాగే కోదండరాం కూడా పదవిరాగానే సైలెంట్ అయిపోయారనే ముద్రపడిపోతుంది. అందుకే ఈ కొత్త కథను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొన్ని శక్తులు సోషల్ మీడియాను బాగా ఉపయోగిస్తున్నారు.
కాగా, ఈ రూమర్లపై కోదండరాం సన్నిహితులు, జేఏసీ నేతలను ఏసియా నెట్ సంప్రదించగా ఇదేమాత్రం వాస్తవం కాదని వారు స్పష్టం చేశారు. ధర్నా చౌక్ తరలింపు, నిరుద్యోగ సమస్య తదితర అంశాలపై మద్దతు కోసం కోదండరాంతో కలసి తామంతా రాష్ట్ర బీజేపీ నేతలను కలిశామని, కమలనాథులు కూడా తాము లేవనెత్తిన సమస్యలపై సానుకూలంగా స్పందించి మద్దతు తెలిపారని, అంతే తప్ప అక్కడ ఎలాంటి వ్యక్తిగత విషయాలను చర్చించలేదని తెలిపారు.
కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్న ప్రభుత్వం మెడలు వంచేందుకు, ప్రజాసమస్యలపై చైతన్యం తీసుకొచ్చేందుకు నవతెలంగాణలో మరో పోరాటం చేస్తున్న జేఏసీని, కోదండరాంను పలుచన చేసేందుకు ఇలాంటి కథనాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.