
Hyderabad: రెండు బృందంగా ఏర్పడిన దొంగల ముఠా ఓ బొటిక్ లోకి ప్రవేశించి.. ఒకేసారి ఎక్కువ చీరలు చూపించాలని చెప్పి సేల్స్ పర్సన్ల దృష్టిని మరల్చి సుమారు రూ.2 లక్షల విలువ చేసే ఐదు చీరలతో పరారయ్యారు. అయితే, ఈ చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చీరలు దొంగిలించిన దొంగలు వాటిని తిరిగి ఇచ్చేశారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలంటూ సదరు షాపు ఓనర్ కు విజ్ఞప్తులు చేశారు. హైదరాబాద్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. నగరంలోని ఐటీ జోన్ లోని ఓ బొటిక్ లో దొంగిలించిన రూ.2 లక్షల విలువైన చీరలకు సంబంధించిన దృశ్యాలను షాపు యజమాని సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో దొంగల ముఠా తిరిగి ఇచ్చేసిన ఘటన చోటుచేసుకుంది. శనివారం దొంగిలించిన చీరలను బొటిక్ సమీపంలో వదిలివెళ్లారు. దొంగల్లో ఒకరు ఆ దృశ్యాలను తన పిల్లలు, కుటుంబ సభ్యులు చూసే అవకాశముందనీ, సోషల్ మీడియా ఖాతా నుంచి ఆ ఫుటేజీని తొలగించాలని షాపు యజమానిని కోరడం గమనార్హం.
మణికొండలోని ఖాజాగూడ ప్రధాన రహదారిలో ఉన్న తేజా సారీస్ బొటిక్ లోకి సోమవారం ఆరుగురు దొంగలు (ఒక పురుషుడు, ఐదుగురు మహిళలు) రెండు బృందాలుగా విడిపోయి కస్టమర్లుగా నటించారు. ఒకేసారి ఎక్కువ చీరలు చూపించాలని చెప్పి సేల్స్ పర్సన్ల దృష్టిని మరల్చి సుమారు రూ.2 లక్షల విలువ చేసే ఐదు చీరలతో పరారయ్యారు. అయితే, 15 నిమిషాల్లో ఏమీ కొనకుండా గుంపులు వెళ్లిపోవడంతో షాపు యజమాని నాగతేజకు అనుమానం వచ్చి స్టాక్ ను చెక్ చేయగా దొంగతనం జరిగినట్టు గుర్తించారు. "నా అనుభవం ప్రకారం, వారి ప్రవర్తన కొంచెం విచిత్రంగా అనిపించింది. స్టాక్, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఐదు చీరలను ముఠా దొంగిలించినట్లు గుర్తించారు. వారు రెండు వేర్వేరు బృందాలుగా వచ్చి నంబర్ ప్లేట్ లేకుండా తెల్లటి స్కార్పియోలో వెళ్లిపోయారు" అని తెలిపారు.
గురువారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని, నిందితులు చీరలను దొంగిలించి దుకాణం నుంచి బయటకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజీని తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ గా మారింది. దొంగల ముఠాకు సైతం ఈ వీడియో గురించి తెలిసింది. వెంటనే దొంగిలించిన సారీలను షాపు ముందర పెట్టి వెళ్లిపోయారు. అలాగే, వీడియోను తొలగించాలని విజ్ఞప్తులు చేసినట్టు షాపు వర్గాలు తెలిపాయి.
నిందితులు తమ వాహనంతో పాటు సీసీటీవీ ఫుటేజీని నాగతేజ పోస్ట్ చేయడంతో శనివారం ఉదయం నిందితుల్లో ఒకరు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పి, దొంగిలించిన చీరలను తిరిగి ఇస్తానని చెప్పారు. దుకాణానికి వచ్చి చీరలు తిరిగివ్వాలని చెప్పగా, ఇది తమ మొదటి తప్పిదమనీ, తన పిల్లలు వారి ముఖాలను చూస్తారనీ, ఆ వీడియోను తొలగించాలని ఆమె పదేపదే నన్ను అభ్యర్థించిందని నాగతేజ తెలిపారు. ఆ ఫుటేజీని తొలగించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందన్నారు. మొదటి కాల్ వచ్చిన కొద్దిసేపటికే ఆ మహిళ మళ్లీ ఫోన్ చేసి చీరలు పక్కనే ఉన్న మరో దుకాణం సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్నాయని చెప్పింది. చీరలను సేకరించి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిందితుల కోసం గాలించగా అప్పటికే వారు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులను అరెస్టు చేసే వరకు వదిలిపెట్టేది లేదని తెలిపారు.