
Ramojirao: ఈనాడు అధినేత రామోజీరావు, మార్గదర్శి ఛైర్మెన్ రామోజీరావుపై ఏపీసీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్స్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని రామోజీరావుతో పాటు మార్గదర్శి మేనేజింగ్ డైరక్టర్ శైలజా కిరణ్, అలాగే ఏపీలోని పలు బ్రాంచీల మేనేజర్లపై సీఐడీ కేసు నమోదు చేసింది. చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి మార్గదర్శి ఖాతాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్దంగా మళ్లింపు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని, ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం నుంచే మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లపై సీఐడీ సోదాలు చేపట్టినట్టు సీఐడీ అధికారులు ప్రకటించారు.
వీరిపై మొత్తం మూడు చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 120(B), 409, 420, 477(A),రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ 1999, చిట్ ఫండ్ యాక్ట్ 1982 లోని పలు సెక్షన్ కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లుగా సీఐడీ తెలిపింది.
ఈ క్రమంలో ఏ 1 నిందితుడిగా చెరుకూరి రామోజీరావు, ఏ 2 నిందితులుగా చెరుకూరి శైలాజా కిరణ్, ఏ 3 నిందితులుగా సంబంధింత బ్రాంచ్ మేనేజర్లపై కేసులు నమోదు చేసింది ఏపీసీఐడీ. ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయనే విషయాన్ని సీఐడీ వెల్లడించలేదు. కానీ.. ఏఏ నగరాల్లో బ్రాంచీపై కేసులు నమోదు చేశారనే విషయాన్ని సీఐడీ వివరించింది.
విశాఖపట్నం, రాజమహేంద్ర వరం, ఏలూరు, విజయవాడ, నర్సరావుపేట, గుంటూరు, అనంతపురం బ్రాంచులపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అదే సమయంలో నర్సరావుపేట, ఏలూరు, అనంతపురం బ్రాంచీల ఫోన్మెన్ పరారీలో ఉన్నారని సీఐడీ తెలిపారు.
ఈ తరుణంలో విజయవాడ మార్గదర్శి ప్రధాన శాఖ మేనేజర్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గతంలోనూ సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిధుల మళ్లింపుపై సీఐడీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫిర్యాదు చేసింది. పలు జిల్లాల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచుల్లో అవకతవకలు బయటపడియనీ, అందుకే వేర్వేరుగా ఎఫ్ఐఆర్లు దాఖలు చేసినట్లు ఏపీసీఐడీ ప్రకటించింది. గతంలో హైదరాబాద్లోనూ సీఐడీ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి న్యాయస్థానాలను ఆశ్రయించింది.