పరిపూర్ణానంద నగర బహిష్కరణ.. కారణం కత్తి మహేష్ కాదా..? మరేంటి?

First Published Jul 11, 2018, 11:55 AM IST
Highlights

సినీ క్రిటిక్ కత్తి మహేష్ విషయంలోనే పరిపూర్ణానందని కూడా బహిష్కరించినట్లు అందరూ భావించారు. అయితే.. నిజానికి అసలు కారణం అది కాదట. పరిపూర్ణానందపై నగర పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని.. వాటిని కూడా వివరించారు..

నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని బుధవారం తెల్లవారుజామున నగరం నుంచి బహిష్కరించారు. అయితే.. సినీ క్రిటిక్ కత్తి మహేష్ విషయంలోనే పరిపూర్ణానందని కూడా బహిష్కరించినట్లు అందరూ భావించారు. అయితే.. నిజానికి అసలు కారణం అది కాదట. పరిపూర్ణానందపై నగర పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని.. వాటిని కూడా వివరించారు..
ఆ కారణాలేంటో ఓ సారి మనమూ తెలుసుకుందామా..

రీజన్ నెం.1

2017 నవంబర్ 1న మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్‌లో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ సభలో స్వామీజీ ప్రసంగిస్తూ ముస్లింలకు, క్రైస్తవులకు మక్కా, జెరూసలెం వెళ్లేందుకు ప్రభుత్వాలు పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని సబ్సీడీలుగా ఇస్తున్నాయని, కానీ హిందువులు తమ పవిత్ర క్షేత్రాలకు వెళ్లాలంటే మాత్రం సర్ ఛార్జీల పేరుతో పన్నులు వసూలు చేస్తున్నారని వ్యాఖ్యానించారని, ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పోలీసులు తమ రిపోర్టులో తెలిపారు.

రీజన్  నెం.2

2017 డిసెంబర్ 2న కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లి గ్రామంలో పరిపూర్ణానంద స్వామి యువతను ఉద్దేశించి.. ‘మీకు నిజాం పాలన కావాలా? లేక ఛత్రపతి శివాజీ పాలన కావాలా’అపి ప్రశ్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మత విద్వేశాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసారని పోలీసులు  పేర్కొన్నారు.

రీజన్ నెం.3
తెలంగాణ భూమిలోనూ రజాకర్లు ఎన్నో ఘోరాలు చేశారని, ప్రజలపై ముఖ్యంగా హిందూ మహిళలపై దమనకాండను కొనసాగించారని పూరిపూర్ణానంద వ్యాఖ్యానించినట్లు పోలీసులు చెప్పారు. అంతేకాకుండా.. తెలంగాణలోని ప్రాంతాలు, పట్టణాల పేర్లను కూడా మార్చాల్సిన అవసరం ఉందని, నిజామాబాద్ పేరును దాని పూర్వనామం ఇందూరుగా పేరు మార్చాలని, నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్‌లకు కూడా పేర్లు మార్చాల్సిందిగా పరిపూర్ణానంద స్వామి డిమాండ్ చేశారని, ఇవన్నీ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పోలీసులు చెప్పుకొచ్చారు.

రీజన్ నెం.4

ఈ ఏడాది మార్చి 11న కరీంనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలోనూ పరిపూర్ణానంద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వామీజీ చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలంటూ తెలంగాణ ప్రివెంటేషన్ ఆఫ్ యాంటీ-సోషల్ అండ్ హాజర్డస్ యాక్టివిటీస్ యాక్ట్ 1980 ప్రకారం స్వామీజీకి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పరిపూర్ణానంద స్వామిని 6నెలల పాటు నగరం నుంచి బహిష్కరించినట్లు పోలీసులు వెల్లడించారు. 

click me!