‘‘థ్యాంక్స్ మోడీజీ’’.. హైదరాబాద్‌లో మరోసారి హోర్డింగ్స్ రాజకీయం, బీఆర్ఎస్‌‌కు కౌంటర్‌గానేనా

By Siva KodatiFirst Published Feb 8, 2023, 2:39 PM IST
Highlights

కేంద్ర బడ్జెట్ విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్‌గా తెలంగాణ బీజేపీ నేతలు హోర్డింగ్స్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెబుతూ ఈ హోర్డింగ్స్ ఏర్పాటయ్యాయి. 

తెలంగాణలో మరోసారి బీజేపీ-టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ హీట్ పెరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మరోసారి హైదరాబాద్‌లో హోర్డింగ్స్‌ రాజకీయం మొదలైంది. కేంద్ర బడ్జెట్ విషయంలో కేటాయింపులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు చెబుతూ నగరంలో కటౌట్స్, హోర్డింగ్స్ వెలిశాయి. తెలంగాణ మధ్య తరగతి ప్రజలు, డబుల్ బెడ్రూం బాధితులు, తెలంగాణ నర్సింగ్ విద్యార్ధులు, గిరిజన విద్యార్ధి సమాఖ్య పేరిట ఈ హోర్డింగ్స్ ఏర్పాటయ్యాయి.

దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలని మోడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అటు ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు కేటాయించడంపై కృతజ్ఞతలు చెబుతూ డబుల్ బెడ్‌రూం బాధితుల సంఘం పేరుతో మరో హోర్డింగ్ ఏర్పాటైంది. కేంద్ర బడ్జెట్ విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్‌గానే బీజేపీ శ్రేణులు హోర్డింగ్స్ రాజకీయం చేస్తున్నారని చర్చ నడుస్తోంది. 

click me!