ఉద్యోగాల నుండి ఉద్వాసనకు గురైన స్టాఫ్ నర్సులు ఆందోళనలు చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేత మధుయాష్కీని కలిశారు. డీఎంఈ కార్యాలయం ముట్టడికి వెళ్లాలని ప్రయత్నించిన నర్సులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: ఉద్యోగాలు కోల్పోయిన స్టాఫ్ నర్సులు డీఎంఈ కార్యాలయం ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన నర్సులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో స్టాఫ్ నర్సులను తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రగతి భవన్ ముందు కూడ రెండు రోజుల క్రితం నర్సులు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.
శుక్రవారంనాడు గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మెన్ మధు యాష్కీని స్టాఫ్ నర్సులు కలిశారు. గాంధీ భవన్ నుండి డీఎంఈ కార్యాలయం ముట్టడికి నర్సులు ప్రయత్నించారు. గాంధీ భవన్ బయటే పోలీసులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నర్సులు ఈ బారికేడ్లను దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు.
పోలీసులు వారిని అడ్డుకొన్నారు. బారికేడ్లను నర్సులు తోసుకొని ముందుకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. డీఎంఈ కార్యాలయానికి నర్సులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకొన్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో కొద్దిసేపు గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకొంది.కరోనా సమయంలో నర్సులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కాంట్రాక్టు పద్దతిలో తీసుకొన్న నర్సులను ప్రభుత్వం తొలగించింది. దీంతో నర్సులు ఆందోళన బాటపట్టారు.