
నూజివీడులో రాజీవ్ గాంధీ ట్రిపుల్ఐటి (రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్-ఆర్ జి యు కె టి) చదవుతున్న వందలాది మంది తెలంగాణా విద్యార్థులు కోర్సు పూర్తయినా బిటెక్ పట్టా చేతికందక ఇబ్బందులు పడుతున్నారు. కారణం, వీరెవరికి తెలంగాణా ప్రభుత్వం స్కాలర్ షిఫ్ అందివ్వడంలేదు. యూనివర్శిటీకి వీరు పడిన బకాయీ తొంబయి వేల నుంచి లక్షన్నర దాకా ఉంటుంది. ఈ బకాయి చెల్లిస్తే తప్ప సర్థిపికెట్ ఇచ్చేది లేదని యూనివర్శిటీ అధికారులు చెప్పేశారు.
ఫలితంగా చదువు పూర్తయినా పట్టా చేతికందక ఉద్యోగాలకు దరఖాస్తు చేయలేకపోతున్నారు. కోర్సు పూర్తవుతూ ఉందని చెప్పి ఉద్యోగాలలో చేరిన మరి కొందరు కంపెనీలకు బిటెక్ సర్టిఫికెట్ సమర్పించలేకపోతున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వాలని లేనిపక్షంలో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కంపెనీలు హెచ్చరిక చేయడంతో చాలా మంది విద్యార్థులు సంక్షోభంలో పడిపోయారు. దాదాపు వేయి మంది దాకా ఇలా తెలంగాణా విద్యార్థులు సతమతమవుతున్నారని, ఏమిచేయాలో పాలుపోవడం లేదని చాలా మంది విద్యార్థులు ఏషియానెట్ కు చెప్పారు.
2010 బ్యాచ్ కు చెందిన తాళ్లూరి గోపి 2016 గేట్ పరీక్షలో అఖిల భారత ర్యాంకు 671 సాధించాడు. తిరుచ్చి ఎన్ఐటిలో మెటీరియల్ సైన్స్ లో పిజి అడ్మిషన్ సంపాయించాడు. అయితే, ఆయన ఆర్ జి యు కె టి- నూజివీడుకు రు. 1,31,650 బకాయి వున్నాడు.
ఇది చెల్లిస్తే తప్ప ఆయనకు అడ్మిషన్ రాదు. “స్కాలర్ షిప్ ఉందనే ధైర్యంతో అరోజు మూడు నాలెడ్జ్ టెక్నాలజీ యూనివర్శిటీలలో నూజివీడును తెలంగాణాకు చెందిన మేమంతా ఎంపిక చేసుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాకెలాంటి సమస్య రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత మా స్కాలర్ షిప్ ను తెలంగాణా విడుదల చేయాలి. 2014 జూన్ నుంచి సాలర్ షిప్ రావడం లేదు. నేను ఒక ఆటో డ్రయివర్ కుమారుడిని. లక్షా ముఫ్పై వేల రుపాయలు చెల్లించే శక్తి లేదు, “ అని తాళ్లూరి గోపి ( ID No. N100683) చెప్పాడు. ఇదే పరిస్థితే మరొక తాళ్లూరి గోపిది కూడా. ఈ గోపి కోర్సు 2017 లో అయిపోతున్నది. ఆయన కూడా లక్షన్నర దాకా బకాయి పడతాడు.
ఉద్యోగాలు వచ్చిన వాళ్ల పరిస్థితి మరొక విధంగా ఉంది. ఆర్ జయ శ్రీ కి ఉద్యోగం వచ్చింది. ఈ కంపెనీ వాళ్లిపుడు ఒరిజినల్ బిటెక్ సర్టిఫికెట్ చూపించాలని అడుగుతున్నారు. అమె కుటుంబానికి ఇంత బకాయీ కట్టి సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితిలేదు. సర్టిఫికెట్ లేకుంటే ఉద్యోగంలో చేరడం కష్టం.
అయితే, ఖమ్మంకు చెందిన సిహెచ్ సృజనలాంటి వాళ్లు చాలా తక్కువ. గత ఏడాది కోర్సు పూర్తి చేసిన సృజన అప్పు చేసి బకాయీ చెల్లించి సర్టిఫికెట్ పొందింది.ఈ విషయం మీద మాట్లాడేందుకు నూజివీడు యూనివర్శిటీ అదికారులెవరు అందుబాటులోకి రాలేదు. స్కాలర్ షిప్ అందని విషయం నిజమేనని తెలంగాణా ఉన్నత విద్యా మండలి ఛెయిర్మన్ ఫ్రొఫెసర్ పాపిరెడ్డి అన్నారు.
“ఆంధ్రప్రదేశ్ తెలంగాణా ల మధ్య కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం పుట్టిన వూరు ప్రాతిపదికన విద్యార్థి ఏ రాష్ట్రానికి చెందితే, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాల విద్యార్థులకు స్కాలర్ షప్ ఇవ్వాలి. ఈ నిధులందివ్వాల్సింది సాంఘిక సంక్షేమ శాఖ,”అని ప్రొఫెసర్ పాపిరెడ్డి చెప్పారు.
ఉన్నతాధికారులకు ఎన్ని వినతిపత్రాలను సమర్పించినా ఫలితం ఉండటం లేదని తాళ్లూరి గోపి అంటున్నాడు.ఈ లోపు 2017లో కోర్సు పూర్తి చేసుకుంటున్న విద్యార్థులు నవంబర్ కాలేజీలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నారు.