సజ్జనార్ రూటే సెపరేట్... ఆర్టిసిని మోసగించిన వారిని ఏం చేసారో తెలుసా..?  

By Arun Kumar PFirst Published Feb 4, 2024, 12:43 PM IST
Highlights

పోలీస్ శాఖలోనే కాదు తెలంగాణ ఆర్టిసిలోనూ తనదైన మార్క్ ప్రదర్శిస్తున్నారు ఐపిఎస్ విసి సజ్జనార్. ఆర్టిసి సంస్థను కాపాడేందుకు మోసగాళ్ళ భరతం పడుతున్నారు ఈ మాజీ పోలీస్ కమీషనర్. 

హైదరాబాద్ : నష్టాల్లో వున్నాసరే... తెలంగాణ ప్రజలకు అలుపెరగకుండా సేవలు అందిస్తోంది ఆర్టిసి సంస్థ. ఇటీవల మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్థిక భారమే అయినప్పటికీ ప్రజల కోసం భరిస్తోంది. ఇలా ప్రజాసేవ చేస్తున్న ఆర్టిసిని మరింత ఆర్థిక కష్టాల్లోకి నెడుతూ ఒకడు భారీ మోసానికి పాల్పడ్డాడు. అయితే సజ్జనార్ ఆర్టిసి ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని పోలీస్ స్టైల్లో యాక్షన్ లోకి దిగారు. దీంతో ఆర్టిసిని చీట్ చేసిన సదరు వ్యక్తి కటకటాలపాలయ్యాడు. 

ఈ వ్యవరహారంపై తెలంగాణ ఆర్టిసి అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజయన్ల పరిధిలోని ఆర్టిసి బస్సుల్లో యాడ్స్ కోసం 'గో రూరల్ ఇండియా' అనే యాడ్ ఏజన్సీ 2015 లో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో తిరిగే మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రకటనల కోసం ఆరేళ్ళపాటు అగ్రిమెంట్ చేసుకుంది. ఇలా 2021 సెప్టెంబర్ వరకు ఈ సంస్థ బస్సుల్లో యాడ్స్ వేసుకుంది.  

అయితే గో రూరల్ ఇండియా సంస్థ ఆర్టిసితో చేసుకున్న ఒప్పందాన్ని విస్మరించింది. సకాలంలో లైసెన్స్ ఫీజు చెల్లించకుండా మోసం చేసింది. దీంతో ఆర్టిసికి ఏకంగా రూ.21.73 కోట్ల నష్టం వాటిల్లింది.  హైదరాబాద్ రీజియన్ లో రూ.10.75 కోట్లు, సికింద్రాబాద్ రీజియన్ లో రూ.10.98 కోట్లు ఈ సంస్థ చెల్లించాల్సి వుంది... కానీ ఇప్పటివరకు ఆ మొత్తాన్ని చెల్లించలేదు. 

Also Read  ఆ యూట్యూబ్ వీడియోలకు లైక్స్ కొట్టారో... ఇక అంతే సంగంతి... డిజిపియే బుక్కయ్యారు... మనమెంత..!

ఇక తెలంగాణ ఆర్టిసి ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఐపిఎస్ సజ్జనార్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. స్వతహాగా ఆయన పోలీస్ కావడంతో ఇలాంటి మోసాలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు... కాబట్టి టీఎస్ ఆర్టిసిని కాపాడేందుకు పోలీస్ యాక్షన్ షురూ చేసారు. ముందుగా ఇలాంటి పెండింగ్ బకాయిలపై సమీక్ష నిర్వహించిన ఆయన... అలాంటి సంస్థలపై చర్యలకు ఆదేశించారు. అంతేకాదు చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలో ఆర్టిసి అధికారులకు తగిన సూచనలిచ్చారు. ఇంకేముంది ఆర్టిసి అధికారులు గో రూరల్ ఇండియా యాడ్ ఏజన్సీ యాజమాన్యానికి నోటీసులు పంపించారు. ఎప్పటిలాగే ఈ నోటీసులను కూడా యాడ్ ఏజన్సీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో పోలీసులను రంగంలోకి దింపింది టీఎస్ ఆర్టిసి. 

గో రూరల్ ఇడియా యాడ్ ఏజన్సీపై అప్జల్ గంజ్, మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్లలో టీఎస్ ఆర్టిసి అధికారులు ఫిర్యాదు చేసారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసును హైదరాబాద్ సెంట్రల్ క్రైం విచారించింది. ఆర్టిసి సంస్థను ఉద్దేశపూర్వకంగానే మోసం చేసినట్లు తేలడంతో ‘గో రూరల్ ఇండియా’ సంస్థ నిర్వాహకుడు వి.సునీల్ ను గత శుక్రవారం అరెస్ట్ చేశారు. 

ఇలా తమ సంస్థను మోసం చేసిన గో రూరల్ ఇండియా సంస్థ నిర్వహకుడు సునీల్ అరెస్ట్ ను టీఎస్ ఆర్టిసి యాజమాన్యం స్వాగతిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.  
ఇలా ఒప్పందాలను ఉల్లంఘించి బకాయిలను ఎగవేసే సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజల కోసం పనిచేస్తున్న ఆర్టిసిని మోసం చేయడానికి ప్రయత్నించేవారికి వదిలిపెట్టబోమని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. 


 

click me!