
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలకు అప్పగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు. అవి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయని తెలిపారు. విద్యార్థులకు ప్రస్తుతం అందుతున్న AICTE గుర్తింపు కొనసాగుతుందని, పాలిటెక్నిక్ విద్య అనంతరం ECET ద్వారా ఇంజినీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ పొందే విధానంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు.
అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న కోర్సులను తొలగించే ఉద్దేశం కూడా లేదని మంత్రి వెల్లడించారు. పరిశ్రమల్లో మారుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని అదనపు కోర్సులు, ఆధునిక నైపుణ్య శిక్షణను అందించేందుకు మాత్రమే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పాలిటెక్నిక్ కాలేజీల ఫీజులు పెంచి విద్యార్థులపై అదనపు భారం మోపే ఆలోచన లేదని స్పష్టం చేశారు. శిక్షణ సమయంలో విద్యార్థులకు రూ.2 వేల స్టైపెండ్ అందించే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికే ప్రకటించినట్లు గుర్తుచేశారు.
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలను సుమారు రూ.800 కోట్లతో ఆధునీకరించేందుకు ప్రతిపాదన రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ అందేలా కాలేజీల్లో మౌలిక వసతులు, శిక్షణా విధానాలను మెరుగుపరచనున్నట్లు చెప్పారు. రక్షణ, ఫార్మాస్యూటికల్స్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో అవసరమయ్యే కొత్త నైపుణ్యాలను విద్యార్థులకు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.
పరిశ్రమలు కోరుకుంటున్న నైపుణ్యాలను ముందుగానే గుర్తించి విద్యార్థులకు వాటిపై శిక్షణ అందిస్తే కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు. అధిక వేతనాలు అందించే ఉద్యోగాలకు అవసరమైన అదనపు స్కిల్సెట్స్ను కూడా విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వల్ల ప్రభుత్వ లెక్చరర్ల ఉద్యోగ భద్రతపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. వారి ప్రభుత్వ ఉద్యోగ హోదా కొనసాగుతుందని, ప్రమోషన్లకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.
పాలిటెక్నిక్లకు సంబంధించిన అంశాలపై విద్యార్థులు, లెక్చరర్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. కేశవరావు ఆధ్వర్యంలోని కమిటీ ఇప్పటికే ఆయా వర్గాలతో చర్చలు జరుపుతోందని చెప్పారు. GO నంబర్ 97పై కూడా అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత అవసరమైన మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
పాలిటెక్నిక్ కాలేజీల భూములను ప్రభుత్వం విక్రయించబోతోందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. అలాంటి ప్రచారంలో వాస్తవం లేదన్నారు. దీనికి ఉదాహరణగా కొత్తగా ఏర్పాటు చేయనున్న 54 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ATCs) కోసం 282 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. ఒకవైపు నైపుణ్య శిక్షణ కేంద్రాల కోసం భూములను కేటాయిస్తూ, మరోవైపు పాలిటెక్నిక్ భూములను విక్రయిస్తున్నారంటూ ప్రచారం చేయడం సరికాదని అన్నారు.
పాలిటెక్నిక్ల ఆధునీకరణలో CSR నిధులను వినియోగించడం కూడా ప్రైవేటీకరణకు సంకేతం కాదని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమలు తమ CSR నిధులను విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలకు కేటాయించవచ్చని, అలాంటి నిధులతో మౌలిక వసతులు మెరుగుపరిచినా కాలేజీల నిర్వహణ, నియంత్రణ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని తెలిపారు.
రాష్ట్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఆధునీకరణ, విస్తరణకు సుమారు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో ఐటీఐలను ఆధునీకరించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. దాదాపు రూ.2,500 కోట్ల పెట్టుబడితో 65 ఏటీసీలను ఏర్పాటు చేసినట్లు, మరో 54 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కేంద్రాల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కరిక్యులమ్ను రూపొందించినట్లు మంత్రి వివరించారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరితో ఈ కరిక్యులమ్పై చర్చించగా, ఆయనతో పాటు ఇతర రాష్ట్రాల మంత్రులు కూడా ప్రశంసించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కరిక్యులమ్ రూపొందించేందుకు తనను కమిటీ ఛైర్మన్గా నియమించినట్లు వెల్లడించారు.
PM SETU పథకంలో భాగంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యంతో నైపుణ్య శిక్షణా కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఒక్కో క్లస్టర్ కేటాయించగా తెలంగాణకు నాలుగు క్లస్టర్లు మంజూరయ్యాయని చెప్పారు. వీటి ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.1,000 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఈ ఏడాది ATCల్లో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థుల్లో సుమారు 99 శాతం మందికి ప్లేస్మెంట్లు వచ్చినట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న మానవ వనరులను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. గత ఏడాది జరిగిన గ్లోబల్ సమ్మిట్లో రూ.5.70 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. ఈ పెట్టుబడులతో ఏర్పడే పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కాలంటే వారికి ముందుగానే అవసరమైన నైపుణ్యాలు నేర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ యువతకు జర్మనీ, జపాన్ సహా యూరప్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పనిచేస్తోందని తెలిపారు. విదేశీ భాషలతో పాటు ఆయా రంగాలకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలకు అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. జర్మనీలో సుమారు 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వాటిని తెలంగాణ యువత అందిపుచ్చుకునేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రైవేటు ఏజెన్సీలు యువతను మోసం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని టామ్కామ్ ద్వారా శిక్షణ, ఉద్యోగ అనుసంధానం చేపడుతున్నామని వివరించారు.
చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో సుమారు 75 మంది యువతకు జర్మన్ భాషలో శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. వారు ప్రస్తుతం A2 స్థాయి వరకు చేరుకున్నారని, మరో మూడు, నాలుగు నెలల్లో B2 స్థాయికి తీసుకెళ్లి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాల ద్వారా సుమారు రూ.25 లక్షల వరకు వార్షిక వేతనాలు అందే ఉద్యోగాలకు యువతను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.
జపాన్ పర్యటనలో హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. వొకేషనల్ ట్రైనింగ్, విద్యార్థుల ఎక్స్ఛేంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణ యువతకు అంతర్జాతీయ అనుభవం, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జర్మనీ, జపాన్, యూరప్ దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నైపుణ్యమున్న యువ మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోందని, ఈ అవకాశాలను తెలంగాణ యువతకు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
పాలిటెక్నిక్లతో పాటు ప్రతి నియోజకవర్గంలో ఉన్న ATCల ద్వారా 50 నుంచి 100 మంది యువతను విదేశీ ఉద్యోగాలకు సిద్ధం చేయాలని మంత్రి ఎమ్మెల్యేలకు సూచించారు. అవసరమైన భాషా శిక్షకులను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. విద్యార్థులకు ఆధునిక విద్య, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ విధానమని గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.