Telangana Municipal Elections 2026 : ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

Published : Feb 11, 2026, 09:24 AM IST
Telangana Municipal Elections 2026

సారాంశం

తెలంగాణలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఇటీవలే గ్రామాల్లో ఎన్నికలు జరగ్గా ఇప్పుడు పట్టణాల్లో జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 11, బుధవారం) ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 

Telangana Municipal Elections 2026 : తెలంగాణ ప్రజలు మరోసారి కీలకమైన తీర్పు ఇచ్చేశారు... అయితే వాళ్లు పాలకపక్షం వైపా లేక ప్రతిపక్షాల వైపా అన్నది త్వరలోనే తేలనుంది. తెలంగాణలోని 7 కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పాలకవర్గాల ఏర్పాటుకు ఎన్నికలు జరుగుతున్నాయి... ఇందులో భాగంగానే ఇవాళ (ఫిబ్రవరి 11, బుధవారం) పోలింగ్ ముగిసింది.

ఉదయం 7 గంటలకే తెలంగాణవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగినట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఓటుహక్కు కలిగిన ప్రతిఒక్కరూ తప్పకుండా పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని... ఓటు వేసి తమ నిర్ణయాన్ని తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి సహా ముఖ్య నాయకులంతా కోరిన విషయం తెలిసిందే. 

మొత్తం 52 లక్షల మంది ఓటర్లు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 1379 మంది రిటర్నింగ్ అధికారులు, 41 వేలమంది పోలింగ్ సిబ్బంది, వేలాదిమంది పోలీస్, ఇతర శాఖల సిబ్బంది ఈ ఎన్నికల కోసం పనిచేస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్, కాంగ్రెస్ నుండి మొత్తం 12,944 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

తెలంగాణలో కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ మున్సిపల్ కార్పోరేషన్లలో 414 డివిజన్లు ఉన్నాయి... అలాగే 116 మున్సిపాలిటీల్లో 2582 వార్డులున్నాయి. వీటన్నిట్లో ఎన్నికలు జరుగుతున్నాయి... అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న పార్టీకి మేయర్, మున్సిపల్ ఛైర్మన్ స్థానాలు దక్కనున్నాయి.

పట్టణ ఓటర్ల తీర్పుపై ఆసక్తి.. 

అయితే ఇప్పటికే తెలంగాణ గ్రామాల ప్రజలు పంచాయితీ ఎన్నికల ద్వారా తమ తీర్పును తెలియజేశారు. ఇప్పుడు పట్టణప్రాంత ఓటర్లు ఎటువైపు అన్నది తేలనుంది. మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే కీలక ఎన్నికలుగా మారాయి. పట్టణ ఓటర్ల తీర్పు భవిష్యత్ రాజకీయ దిశను సూచించే అవకాశముండటంతో ఈ ఎన్నికలపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇవాళ పోలింగ్ జరగ్గా ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు, పలితాల వెల్లడి ఉంటుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Oyo: తెలుగు ప్ర‌జ‌ల‌కు ఓయో గుడ్ న్యూస్‌.. ఇక‌పై ఆ న‌గ‌రాల్లో కూడా రూమ్స్
నిష్ఠ‌తో లేక‌పోతే ఈ ఆలయానికి వెళ్లే దారి మర్చిపోతారు.. హైదరాబాద్‌కు ద‌గ్గ‌ర్లో 900 ఏళ్ల చరిత్ర ఉన్న టెంపుల్‌