
తెలంగాణలో మరో అంతర్జాతీయ దిగ్గజం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ ప్లాంట్ నిర్మాణానికి ఫ్రెంచ్ దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్ గురువారం శంకుస్థాపన చేసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ష్నైడర్ సంస్థ దాదాపు రూ.300 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నందుకు కంపెనీ ప్రతినిధులను అభినందించారు. అలాగే స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి శిక్షణను ఇవ్వాలని కేటీఆర్ కంపెనీని కోరారు.
స్థానిక యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా అది ఎంతో ఉపయోగకరంగా వుంటుందని మంత్రి అన్నారు. ఒకే రోజు హైదరాబాద్లో మూడు ఫ్రెంచ్ కంపెనీల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని ఫ్రెంచ్ సంస్థలు తెలంగాణ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఏడాది లోపే ష్నైడర్ సంస్థ తన హైదరాబాద్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభిస్తుందని కేటీఆర్ అన్నారు. ఈ కంపెనీ ద్వారా స్థానిక యువతకు దాదాపు 1000 ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అంతకుముందు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలను కేటీఆర్ కోరారు. గురువారం నగరంలో జరిగిన ఫ్రెంచ్ బిజినెస్ మిషన్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామిక పాలసీ, పెట్టుబడులకు అవకాశాలపై కేటీఆర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.