
హైదరాబాద్: వైఎస్ షర్మిలకు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో బుధవారం నాడు రైతు వేదికను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరో వచ్చి తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని పరోక్షంగా షర్మిల గురించి ఆయన విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో రైతులకు న్యాయం జరిగిందా అని ప్రశ్నించే వారికి తెలంగాణ గురించి కనీస పరిజ్ఞానం ఉందా? అని ప్రశ్నించారు.
ఏపీలో రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఎంత భూమి ఉన్నా రూ. 12.500 మాత్రమే ఇస్తున్నారని, అదే ఇక్కడ ఎకరానికి పదివేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతుబంధు ఇస్తున్నామని హరీష్ గుర్తు చేశారు.
తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకే షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే షర్మిల మంగళవారం నాడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలతో షర్మిల సమావేశం నిర్వహించారు.