జీఎస్టీ బకాయిలను కేంద్రం చెల్లించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
హైదరాబాద్:జీఎస్టీ బకాయిలను కేంద్రం చెల్లించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఆదాయం మిగిలితే తీసుకొంటాం.. తగ్గితే అప్పు తెచ్చుకోవాలనే తీరుతో కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
కరోనా సాకుతో రూ. 1.35 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఎగ్గొట్టాలని చూస్తోందన్నారు.మూడు లక్షల కోట్ల జీఎస్టీ బకాయిలను లక్షా 65 వేల కోట్లకు తగ్గించడం దారుణమన్నారు.
యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పార్టీలు మారినా రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వాల వైఖరిలో మార్పులు లేవన్నారు.
జీఎస్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రం 4 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం రూ. 8వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని మంత్రి తెలిపారు.రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన సెస్సును కేంద్రం ఎగ్గొట్టాలని చూస్తోందని హరీష్ రావు ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ పరిమితులకు లోబడి రాష్ట్రాలు పనిచేయాల్సి ఉంటుందన్నారు. జీఎస్టీలో తెలంగాణ చేరకపోతే తమ రాష్ట్రానికి రూ. 25 వేల కోట్లు అదనంగా వచ్చేవని హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జీఎస్టీ పరిహారాన్ని పూర్తిస్థాయిలో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. దీన్ని తగ్గించాలని చూడడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు.ఈ విషయమై పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. అవసరమైతే కేంద్రంపై న్యాయపరమైన పోరాటానికి కూడ సిద్దమని ఆయన చెప్పారు.
జీఎస్టీ బకాయిల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాసినట్టుగా ఆయన చెప్పారు. జీఎస్టీ పరిహరం చెల్లింపుల విషయమై పది రాష్ట్రాల ఆర్దిక మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించినట్టుగా ఆయన తెలిపారు.