అవును... తెలంగాణ జర్నలిస్టులు పోరుబాట పట్టారు. రోడ్డెక్కి దీక్ష చేశారు. గొంతెత్తి నినదించారు. ఇంతకాలం తెలంగాణ జర్నలిస్టులు సర్కారు మాటలు నమ్ముతూ వచ్చారు. కానీ గడిచిన నాలుగేళ్లలో సర్కారు తమను పట్టించుకోలేదన్న ఆవేదనతో రోడ్డెక్కారు. నిరహార దీక్షకు దిగారు. జర్నలిస్టుల సమస్యలపై సర్కారు మాటలకే పరిమితం అయిందని ఆగ్రహించారు. మహబూబాబాద్ జిల్లాలో జర్నలిస్టులు నిరహారదీక్షకు దిగారు. మహబూబాబాద్ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఈ దీక్షా కార్యక్రమం జరిగింది. తెలంగాణలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్టలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరి చేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ లో జర్నలిస్ట్ ల నిరాహారదీక్ష జర్నలిస్టు కమ్యూనిటీలో హాట్ టాపిక్ అయింది.
టియుడబ్ల్యూజె (ఐజెయు) ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షా కార్యక్రమంలో టియుడబ్ల్యూజె (ఐజెయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, జిల్లా నేతలు ఆవుల యుగేందర్, కల్లూరి ప్రభాకర్, మట్టూరి నాగేశ్వరరావు, సదాశివుడు, డివై గిరి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (143) నాయకులు జిల్లా కలెక్టర్ కు మెమోరాండం సమర్పించారు. తక్షణమే జర్నలిస్టులకు ఇండ్లు, స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్ రెడ్డి, జలగం శేఖర్, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.