Telangana: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. జ‌లాశ‌యాల్లోకి భారీగా వరద నీరు.. మరో రెండు రోజులు వానలు

Published : Sep 11, 2022, 10:42 PM IST
Telangana: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. జ‌లాశ‌యాల్లోకి భారీగా వరద నీరు.. మరో రెండు రోజులు వానలు

సారాంశం

Heavy rains: రాష్ట్రంలో ప్రధాన నీటి వనరులు ముఖ్యంగా కృష్ణా బేసిన్‌లోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ (పీజేపీ), శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్‌ఎస్‌పీ), సింగూర్, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ), గోదావరి బేసిన్‌లోని కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిపోయాయి.  

Telangana rains: తెలంగాణలో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల్లోకి వ‌ర‌ద‌నీటి ఇన్‌ఫ్లోలు గణనీయంగా పడిపోయిన కొద్ది రోజులకే మళ్లీ ఎగువ, పరీవాహక ప్రాంతాల నుంచి జలవనరులకు భారీగా ఇన్‌ఫ్లోలు వస్తున్నాయి. రాష్ట్రంలోని జ‌లాశ‌యాల్లోకి భారీగా వ‌ర‌ద నీరు రావ‌డంతో.. చాలా ప్రాజెక్టులు పూర్తిస్థాయి మ‌ట్టాల‌కు దగ్గ‌ర‌గా ఉన్నాయ‌ని స‌మాచారం. ఇన్ ఫ్లోలు ఒక్కసారిగా పెరగడంతో నీటిపారుదల శాఖ అధికారులు పలు ప్రాజెక్టుల రేడియల్ క్రెస్ట్ గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. మరో రెండు రోజులు వర్షాలు కురిస్తే, నీటి వనరులకు సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి నీటి విడుదల సామర్థ్యాన్ని మరింత పెంచుతామని అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. గోదావరి తర్వాత కృష్ణా బేసిన్‌లో డ్యామ్‌లు నీటితో నిండిపోయాయి. శ్రీశైలం గేట్లు తెరిచారు. రాష్ట్రంలో ప్రధాన నీటి వనరులు ముఖ్యంగా కృష్ణా బేసిన్‌లోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ (పీజేపీ), శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్‌ఎస్‌పీ), సింగూర్, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ), గోదావరి బేసిన్‌లోని కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిపోయాయి. ఈ నీటి వనరుల ప్రస్తుత నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 85 శాతం నుంచి 100 శాతం మధ్య ఉంది. నిజామాబాద్‌లోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ, మహబూబ్‌నగర్‌లోని పీజేపీ, జయశంకర్‌-భూపాలపల్లిలోని లక్ష్మీ బ్యారేజీ నుంచి ఆర్‌సీ గేట్లను తెరిచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 7.45 గంటలకు ఎస్‌ఆర్‌ఎస్‌పి వద్ద 28 ఆర్‌సి గేట్ల నుంచి నీటి విడుదలను 1.49 లక్షల క్యూసెక్కులకు పెంచగా, సాయంత్రం 4 గంటల సమయానికి 30 గేట్ల ద్వారా నీటి విడుదల సామర్థ్యాన్ని 1.99 లక్షల క్యూసెక్కులకు పెంచారు. 1.75 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొన‌సాగుతోంది. పీజేపీ వద్ద, కర్ణాటకలోని అప్‌స్ట్రీమ్ నారాయణపూర్ డ్యామ్, పరివాహక ప్రాంతాల నుంచి 1.81 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో ఇంజనీర్లు శ్రీశైలం డ్యామ్‌కు 35 గేట్ల ద్వారా 1.86 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హైడల్ పవర్ ఉత్పత్తి కోసం ఇంజనీర్లు పీజేపీ వద్ద 33,799 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లక్ష్మీ బ్యారేజీకి 4.89 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో అధికారులు 65 గేట్ల నుంచి అంతే పరిమాణంలో నీటిని విడుదల చేస్తున్నారు.

ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సోమవారం ఉదయం వరకు కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం తెలిపింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తన వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది . సోమవారం నుండి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఆదివారం రాత్రి ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. రెండు వారాల పొడిగాలుల తర్వాత భారీ వర్షాలు నగరంలో మళ్లీ కనిపించాయి. ఆగస్టు ప్రారంభంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయమైనప్పుడు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ వారం కూడా అదే పరిస్థితితో రోడ్లు-వీధులు మరోసారి జలమయమయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల సెల్సియస్ నుండి 32 డిగ్రీల సెల్సియస్ వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల సెల్సియస్ నుండి 24 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu