
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అమ్నేషియా పబ్ అత్యాచార ఘటనపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. నిందితులపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని.. దర్యాప్తు వేగవంతం చేశారని అలీ అన్నారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించమని హోంమంత్రి స్పష్టం చేశారు.
అంతకుముందు ఈ కేసులో ఆరోపణల నేపథ్యంలో హోంమంత్రి మొహమూద్ అలీ మనవడు పుర్ఖాన్ స్పందించారు. అత్యాచార ఘటనతో తనకు సంబంధం లేదని.. ఘటన జరిగిన రోజున తాను మినిస్టర్స్ క్వార్టర్స్లో వున్నానని పుర్ఖాన్ తెలిపారు. తాను ఎవ్వరికీ పార్టీ ఇవ్వలేదని.. వాళ్లు ఎవరో కూడా తనకు తెలియదని ఆయన స్పష్టం చేశారు. ఆరోపణలు చేసిన వారు నిజానిజాలు తెలుసుకోవాలంటూ పుర్ఖాన్ అన్నారు.
మరోవైపు.. హైదరాబాద్ ఆమ్నేషియా పబ్ అత్యాచారం కేసుపై (amnesia pub rape case) తెలంగాణ ప్రభుత్వం (telangana govt) సీరియస్గా స్పందించింది. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని.. తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో బాలిక రేప్ కేసులో వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ (waqf board chairman) కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివారులోని ఓ ప్రాంతంలో అతనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కుమారుడితో పాటు మరో మైనర్ బాలుడు వున్నాడు. హోదాతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని.. డీజీపీ, సీపీకి మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read:amnesia pub rape case: నాకు సంబంధం లేదు.. ఆ రోజు మినిస్టర్స్ క్వార్టర్స్లో వున్నా : హోంమంత్రి మనవడు
ఇకపోతే.. అత్యాచార కేసుకు సంబంధించి బీజేపీ (bjp) ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి మనవడు, పీఏ పాత్రపై నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. హోంమంత్రి మనవడే సూత్రధారంటూ రఘునందన్ రావు ఆరోపించారు. పబ్లో పార్టీ బుక్ చేసిందే హోంమంత్రి (home minister mahmood ali ) మనవడని ఆయన పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీ (mim) ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి కుమారుడు, పాతబస్తీకి చెందిన ఓ ప్రముఖ దినపత్రిక డైరెక్టర్ కొడుకు , హోంమంత్రి మనవడు , హోంమంత్రి పీఏ హరిలు సీసీటీవీ ఫుటేజ్లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నారని రఘునందన్ రావు చెబుతున్నారు.
ఇప్పటి వరకు రేప్ కోసం వాడిన కారును ఎందుకు సీజ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇదంతా హిందూ అమ్మాయిలపై రజాకార్ల వారసత్వ మనస్తత్వం కలిగిన ఎంఐఎం పార్టీ పెద్దలు కొందరు, టీఆర్ఎస్ పార్టీ మంత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కొందరు కలిసి జరుపుతున్న దాడిగా బీజేపీ ఆరోపిస్తోందని రఘునందన్ రావు అన్నారు. నిజంగా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి వుంటే .. హోంమంత్రిని ఆ పదవి నుంచి తొలగించి నిష్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. హోంమంత్రి పదవిలో మహమూద్ అలీ వుంటే దర్యాప్తు పారదర్శకంగా జరగదని రఘునందన్ రావు ఆరోపించారు.