తెలంగాణ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపు నిర్ణయం వెనక్కి.. కారణమిదే

By Siva KodatiFirst Published Nov 19, 2021, 8:48 PM IST
Highlights

ప్రజాప్రతినిధుల (people representatives) గౌరవ వేతనం (honorarium) పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం (telangana govt) వెనక్కి తగ్గింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (mlc elections code) కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు సమాచారం

ప్రజాప్రతినిధుల (people representatives) గౌరవ వేతనం (honorarium) పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం (telangana govt) వెనక్కి తగ్గింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (mlc elections code) కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు సమాచారం. గౌరవ వేతనాల పెంపునకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని (election commission of india) రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా తెలుస్తోంది. 

గత ఆదేశాల ప్రకారం.. రాష్ట్రంలోని హైదరాబాద్‌ సహా ఇతర నగరపాలక సంస్థల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, పురపాలక ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లకు, కోఆప్షన్‌ సభ్యులకు రవాణా భత్యంతో పాటు గౌరవ వేతనాలు 30 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. మేయర్ల నెలసరి వేతనం రూ.50 వేల నుంచి రూ.65 వేలకు, డిప్యూటీ మేయర్ల వేతనం రూ.25 వేల నుంచి రూ.32500కి, కార్పొరేటర్లకు రూ.6000 నుంచి రూ.7800కి పెంచింది. 

Also Read:Telangana MLC: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి.. ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్

50 వేల జనాభా దాటిన పురపాలక సంఘాల్లో ఛైర్‌పర్సన్లకు రూ.15000 నుంచి రూ.19500, వైస్ ఛైర్‌పర్సన్లకు రూ.7500 నుంచి రూ.9750, కౌన్సిలర్లకు రూ.3500 నుంచి రూ.4550కి పెరగనున్నాయి. అలాగే 50 వేల కంటే తక్కువ జనాభా గల మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లకు రూ.12000 నుంచి రూ.15600, వైస్ ఛైర్‌పర్సన్లకు రూ.5000 నుంచి రూ.6500, కౌన్సిలర్లకు రూ.2500 నుంచి 3250 రూపాయల చొప్పున జులై నుంచి వేతనాలను పెంచాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం మరో ఉత్తర్వు జారీ చేసింది. 

కాగా... ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల టీఆర్‌ఎస్ (trs) పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి,  కడియం శ్రీహరి, తక్కళపల్లి రవీంద్రరావు, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, బండ ప్రకాష్‌లు నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ (kcr) కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌ నగర్, కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాల చొప్పున, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించి నవంబర్ 23‌ను నామినేషన్ల స్వీకరణకు అఖరి తేదీ.
 

click me!