
మరో నెలలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల యానిఫాంలో మార్పులు చేసింది. తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలతో పాటు ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదవుకుంటున్న 24,27,391 మంది విద్యార్ధులకు ప్రభుత్వం ఉచితంగా రెండు జతల యూనిఫాంలను సరఫరా చేస్తోంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలకు కార్పోరేట్ లుక్ తీసుకోచ్చేందుకు సర్కార్ కృషి చేస్తోంది. దీనిలో భాగంగానే యూనిఫాంను మార్చేందుకు సిద్ధమైంది. ఎరుపు, బూడిద రంగు చొక్కా.. మెరూన్ రంగు సూటింగ్కు అంటుకుని వుండే విధంగా కొత్త యూనిఫాంను డిజైన్ చేశారు. ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు విడివిడిగా డిజైన్లను రూపొందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 24,27,391 మంది విద్యార్ధులకు కావాల్సిన యూనిఫాం క్లాత్ను తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేయనుంది ప్రభుత్వం. వివిధ మండలాలకు గుడ్డను పంపి.. పాఠశాలలకు అప్పగిస్తున్నారు. యూనిఫాంను కుట్టే బాధ్యత గతంలో స్వయం సహాయక సంఘాలకు అప్పగించేవారు.. ఈసారి స్థానిక టైలర్లకు కట్టబెట్టారు. మే 31 నాటికి యూనిఫాంను కుట్టడం పూర్తి చేసి విద్యార్ధులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లనుు ఆదేశించింది.