
ఉద్యోగుల పరస్పర బదిలీలకు (mutual transfers) తెలంగాణ ప్రభుత్వం (telangana govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. బదిలీ కోరుకునే ఉద్యోగులు మార్చి 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఉద్యోగులు నెల రోజుల్లో మ్యూచువల్ను వెతుక్కునే అవకాశం వుంది. ఒక ప్రాంతంలో ఉద్యోగం చేయడం ఇష్టం లేని వారు.. మరో ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న వారిని .. పరస్పర అంగీకారంతో బదిలీపై తాను పనిచేస్తున్న ఏరియాకు పిలిపించడమే ‘‘మ్యూచువల్ ట్రాన్స్ఫర్’’.
కాగా.. కొత్త జోనల్ వ్యవస్థ (zonal system in telangana) నిబంధనల ప్రకారం.. జిల్లా స్థాయిలోని రెండున్నర లక్షల ఉద్యోగులకు గాను.. దాదాపు 38 వేల మంది బదిలీ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రత్యేక కేటగిరీలు, దంపతుల విభాగంలో తమకు పోస్టింగులు ఇవ్వాలని వేల సంఖ్యలో అప్పీళ్లు రావడంతో.. ప్రభుత్వం గత 10 రోజులుగా వాటిని పరిశీలిస్తూ తుది నిర్ణయం తీసుకోవడానికి తర్జనభర్జన పడింది. ఆ ప్రక్రియ పూర్తి అయ్యాకే ఖాళీలకు అనుగుణంగా పోస్టింగులు ప్రక్రియ ప్రారంభించినట్టు తెలుస్తోంది. అటు జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టులకు సంబంధించి బదిలీలు, పోస్టింగ్ ల ప్రక్రియను వేగవంతం చేసింది రాష్ట్రప్రభుత్వం. ఈ విభాగంలో వచ్చిన అప్పీళ్ల పరిష్కారం దాదాపుగా పూర్తయ్యినట్టు తెలుస్తోంది.
జోనల్ , మల్టీ జోనల్ విభాగంలో తొమ్మిది వేల మంది వరకు ఉద్యోగులు బదిలీ కానున్నట్టు సమాచారం. ఇప్పటికే వారికి పోస్టింగులు ఇచ్చేందుకు.. ఆయా సంబంధిత శాఖల అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశాయి. ఇందులో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న వైద్య-ఆరోగ్య తదితర శాఖల్లో జోన్ల వారిగా ప్రత్యేకాధికారులను నియమించినట్టు తెలుస్తోంది.
కొత్త జోనల్ విధానం ప్రకారం.. డీఎస్పీ, ఆర్డీఓ, తదితర కీలక పోస్టులు రాష్ట్ర స్థాయి నుంచి మల్టీజోనల్ స్థాయికి మార్చారు. ఈ కేడర్ పోస్టింగుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ సూచించారు. పోస్టింగుల ప్రక్రియ వేగవంతం చేయాలని... రెండు, మూడు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పోస్టింగ్ ప్రక్రియ పూర్తయ్యాక మ్యూచవల్ ట్రాన్ ఫర్స్ అంశంపై కేసీఆర్ సర్కార్ దృష్టి సారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.