
హైదరాబాద్: నల్గొండ, ఆలంపూర్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను కొనసాగించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది.
ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 12న. ప్రారంభమయ్యాయి.ఈ సమావేశాల ప్రారంభసూచికంగా గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లు గవర్నర్ పై హెడ్ ఫోన్ విసిరారు. దీంతో శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ కన్నుకు గాయమైంది.
ఈ ఘటనను తెలంగాణ సర్కార్ సీరియస్ గా తీసుకొంది. నల్గొండ, ఆలంపూర్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్కుమార్ ల సభ్యత్వాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్కుమార్ లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దును కోర్టు తప్పు బట్టింది. తక్షణమే వీరద్దరూ కూడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని హైకోర్టు సింగిల్ బెంచ్ ప్రకటించింది. ఈ తీర్పును అమలు చేయలేదు. 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ కూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్లను తోసిపుచ్చింది.
హైకోర్టు డివిజన్ చెంచ్ ఉత్తర్వులను కూడ అమలు చేయలేదు. దీంతో కోర్టు ధిక్కరణ పిటిషన్లను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాఖలు చేశారు. ఈ విషయమై ఈ ఏడాది జూలై 27వ తేదీన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. వారం రోజుల్లోపుగా ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేలుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను ఎందుకు కొనసాగించడం లేదో చెప్పాలని కోరింది.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సర్కార్ బుధవారం నాడు హైకోర్టు డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ ను విచారణ చేపట్టాలని అడ్వకేట్ జనరల్ కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై ఆగష్టు 16వ తేదీన విచారణను చేపట్టనున్నట్టు డివిజన్ బెంచ్ ప్రకటించింది.
ఈ వార్తలు చదవండి:కోమటిరెడ్డి, సంపత్ కేసు: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు
సభ్యత్వాల రద్దు: కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కోమటిరెడ్డి, సంపత్
టిఆర్ఎస్కు మరో షాక్: 12 మంది ఎమ్మెల్యేల పిటిషన్ను తిరస్కరించిన కోర్టు